
ఆస్ట్రేలియా పేస్ బౌలర్ మిచెల్ స్టార్క్ ఎనిమిదేళ్ల తర్వాత భారత రిచ్ లీగ్ T20 టోర్నమెంట్ అయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2024 ఎడిషన్కు తిరిగి రావాలని చూస్తు్న్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఎడమచేతి వాటం బౌలర్ చివరిసారిగా 2015 పోటీలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఆడాడు. కానీ, ఇటీవలి సంవత్సరాలలో తన ఆట భారాన్ని తగ్గించుకోవడానికి, జాతీయ జట్టు విధులపై దృష్టి పెట్టడానికి IPL నుంచి తప్పుకున్నాడు.

అమెరికా, వెస్టిండీస్లో జరిగే టీ20 ప్రపంచకప్నకు ఐపీఎల్ మంచి సన్నాహకమని స్టార్క్ భావిస్తున్నాడు. ఈ క్రమంలోనే 8ఏళ్ల తర్వాత ఈ లీగ్లో ఆడాలని కోరుకుంటున్నాడు. “ఎనిమిదేళ్లు. నేను ఖచ్చితంగా (వచ్చే సంవత్సరం) తిరిగి వెస్తాను” అని 33 ఏళ్ల లెఫ్ట్ హ్యాండ్ పేసర్ 'విల్లో టాక్' పోడ్కాస్ట్తో చెప్పుకొచ్చాడు.

“ఇతర విషయాలతోపాటు, ఇది T20 ప్రపంచ కప్నకు గొప్ప అవకాశంలా ఉంటుంది. వచ్చే ఏడాది ఐపీఎల్ 2024లో ఆడడంతో టీ20 ప్రపంచకప్నకు చక్కగా ప్రిపేర్ అవ్వొచ్చు. ఇది సరైన అవకాశంగా భావిస్తున్నాను”అంటూ ఈ ఆస్ట్రేలియా పేస్ బౌలర్ తెలిపాడు.

ఆస్ట్రేలియా జట్టు దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్తో 50 ఓవర్ల ప్రపంచ కప్ కోసం సన్నాహకంలో ఉండగా, స్టార్క్ ప్రస్తుతం గజ్జల్లో గాయంతో ఈ సిరీస్కు దూరంగా ఉన్నాడు. అయితే, వచ్చే నెలలో భారత్లో జరగనున్న టోర్నీ కోసం ఆస్ట్రేలియా తాత్కాలికంగా 15 మందితో కూడిన జట్టులో ఈ ఎడమచేతి వాటం పేసర్కు చోటు దక్కింది.