
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ నేటి కాలంలో తనకంటూ ఒక బ్రాండ్గా మారాడు. ఆటైనా, ప్రకటనలైనా, వ్యాపారమైనా అన్నింటా కోహ్లీదే ఆధిపత్యం. డబ్బు సంపాదనతో పాటు ఈ డబ్బును ఎలా సక్రమంగా వినియోగించుకోవాలో కూడా కోహ్లీకి తెలుసు. అందుకే తన వంతు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.

విరాట్ కోహ్లీ వీకే ఫౌండేషన్ నెలకొల్పి వర్ధమాన ఆటగాళ్లకు తన వంతు ఆర్థిక సహాయం చేస్తున్నారు. అదే సమయంలో, అనుష్క శర్మ మూగ జంతువుల క్షేమం కోసం తనవంతు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పుడు ఇద్దరూ తమ ఫౌండేషన్లను విలీనం చేయాలని నిర్ణయించుకున్నారు.

విరాట్ కోహ్లి, అనుష్క తమ తమ ఫౌండేషన్లను మెర్జ్ చేసి SeVVA పేరుతో కొత్త ఫౌండేషన్ నెలకొల్పారు. వర్ధమాన ఆటగాళ్లకు చేయూత అందించడంతో పాటు మూగ జీవాల సంక్షేమానికి ఈ ఫౌండేషన్ పనిచేస్తుంది.

తాజాగా జరిగిన స్పోర్ట్స్ హానర్స్ అవార్డ్లో విరాట్ కోహ్లీ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించాడు. ఆపదలో ఉన్నవారికి తన ఫౌండేషన్ సహాయం చేస్తుందని విరాట్ చెప్పాడు. SeVVA ఫౌండేషన్ పేరులో వీవీఏ అంటే విరాట్, వామిక, అనుష్క.

కోహ్లీ గురువారం అనుష్క శర్మతో కలిసి స్పోర్ట్స్ హానర్ అవార్డ్స్ ఈవెంట్కు హాజరయ్యారు. నీరజ్ చోప్రా, శుభ్మన్ గిల్, దీపికా పదుకొనే-రణ్వీర్ సింగ్ వంటి ప్రముఖులు కూడా ఈ ఈవెంట్లో సందడి చేశారు.