
మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కాంబినేషన్లో ఓ సినిమా మొదలై ఆగిపోయిందని చాలా మందికి తెలియని విషయం. నిర్మాత అశ్వినీదత్ సారథ్యంలో మొదలైన ఈ ప్రాజెక్ట్ వెనుక ఓ ఆసక్తికర కథ ఉంది.

జగదేకవీరుడు అతిలోకసుందరి సెన్సేషనల్ హిట్ తర్వాత ఐదేళ్లకు మళ్లీ చిరంజీవి, అశ్వినీదత్లు కలిసి ఓ సినిమా చేయాలనుకున్నారు. చిరంజీవి డేట్స్ ఇవ్వడంతో కొత్త కాంబినేషన్లో సినిమా నిర్మించాలని అశ్వినీదత్ సంకల్పించారు. మొదట సింగీతం శ్రీనివాసరావును దర్శకుడిగా సంప్రదించారు. ఆయన అంగీకరించడంతో, అశ్వినీదత్ ఈ విషయాన్ని చిరంజీవికి తెలిపారు.

సింగీతంతో కొత్త సినిమా చేయాలని, కథ రెడీ చేయమని చిరంజీవి కోరారు. వెంటనే రచయిత సత్యానంద్ భూలోక వీరుడు అనే కథను సిద్ధం చేశారు. చిరంజీవి కథ విని వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇళయరాజా సంగీత బాధ్యతలు చేపట్టగా, టబును హీరోయిన్గా ఎంపిక చేశారు. షూటింగ్ కూడా మొదలైంది. చిరంజీవి, టబులపై కొన్ని సన్నివేశాలతో పాటు రెండు పాటలు చిత్రీకరించారు. కానీ, షూటింగ్ మధ్యలో ఉండగా, కథ విషయంలో కొన్ని ఇబ్బందులు తలెత్తి సినిమా ఆగిపోయింది. ఈ పరిణామంతో నిర్మాత అశ్వినీదత్ బాధపడ్డారు. ఆయన్ని ఓదార్చి, మళ్లీ నేను మేకప్ వేస్తే మీ బ్యానర్ సినిమాలోనే అంటూ చిరంజీవి మాట ఇచ్చారు. ఆ తర్వాత అశ్వినీదత్ మళ్లీ చిరంజీవి సినిమాకి దర్శకుడి కోసం అన్వేషణ మొదలుపెట్టారు.

బాలీవుడ్లో మంచి పొజిషన్లో ఉన్న రామ్ గోపాల్ వర్మతో సినిమా చేయాలని నిర్ణయించారు. మెగాస్టార్, ఆర్జీవీ కాంబో సినిమాకు తిరుగులేదని భావించారు. ఈ విషయాన్ని చిరంజీవికి చెప్పగానే, ఆయన ఆసక్తి చూపారు. ప్రాజెక్ట్ ఖరారైంది. మెగాస్టార్తో తొలిసారి సినిమా చేస్తున్నందున, ఆర్జీవీ సరికొత్త స్క్రిప్ట్ సిద్ధం చేశారు. హీరోయిన్గా ఊర్మిళను ఎంపిక చేయాలనుకున్నారు. మణిశర్మను సంగీత దర్శకుడిగా, చోటా కె. నాయుడును కెమెరామెన్గా ఖరారు చేశారు. 1996 ఆగస్టు 11న ఈ సినిమా ప్రారంభమైంది. కర్ణాటకలో తొలి షెడ్యూల్ ప్లాన్ చేసి, చిరంజీవి, ఊర్మిళలపై కొన్ని సన్నివేశాలతో పాటు ఒక పాటను చిత్రీకరించారు.

తొలి షెడ్యూల్ పూర్తయ్యి, రెండో షెడ్యూల్ ప్రారంభమయ్యేలోపు అనుకోని సంఘటన చోటుచేసుకుంది. సంజయ్ దత్ జైలు నుంచి విడుదలయ్యారు. అప్పటికే ఆర్జీవీ సంజయ్ దత్తో ఒక హిందీ సినిమా తీస్తున్నారు. సంజయ్ దత్ అనుకోకుండా జైలుకు వెళ్లడంతో, ఆ హిందీ సినిమాను పక్కనపెట్టి హైదరాబాద్ వచ్చి చిరంజీవి సినిమా మొదలుపెట్టారు ఆర్జీవీ. సంజయ్ దత్ జైలు నుంచి విడుదలవ్వగానే, పాక్షికంగా చిత్రీకరించిన ఆ హిందీ సినిమాను పూర్తి చేయాల్సిన బాధ్యత రామ్ గోపాల్ వర్మపై పడింది. వెంటనే ఆయన ఈ సంగతిని చిరంజీవి, అశ్వినీదత్లకు వివరించి, సంజయ్ సినిమాను కంప్లీట్ చేసి వచ్చి ఈ సినిమాను పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. దౌడ్ అనే ఆ హిందీ సినిమా కోసం ఆర్జీవీ బాలీవుడ్కు వెళ్లారు.

ఆ తర్వాత ఈ కాంబో సినిమా మళ్లీ సెట్స్పైకి వెళ్లలేదు. ఎక్కడైతే షూటింగ్ జరిగిందో అక్కడే ఆగిపోయింది. ఆర్జీవీ కోసం కొన్ని రోజులు వేచి చూసిన చిరంజీవి, ఆ తర్వాత వరుసగా ఇతర సినిమాలు అంగీకరించి హీరోగా బిజీ అయ్యారు. అయితే, అశ్వినీదత్కు ఇచ్చిన మాటను చిరంజీవి నిలబెట్టుకున్నారు. గుణశేఖర్ దర్శకత్వంలో, అశ్వినీదత్ నిర్మాతగా, వైజయంతి మూవీస్ బ్యానర్లో చూడాలని ఉంది అనే సినిమా చేసి బ్లాక్బస్టర్ విజయం సాధించారు. ఇక, సింగీతం దర్శకత్వంలో ఆగిపోయిన సినిమాకు ఇళయరాజా అందించిన పాటలను, అలాగే ఆర్జీవీ సినిమాకు మణిశర్మ స్వరపరిచిన పాటలను వినాలని ఉంది అనే పేరుతో ఆడియో క్యాసెట్గా విడుదల చేశారు. ఆ తర్వాత చూడాలని ఉంది సినిమా 50 రోజులు పూర్తి చేసుకున్నాక, ఈ పాటలను థియేటర్లలో ప్రదర్శించారు. ఇది మెగాస్టార్ చిరంజీవి, ఆర్జీవీ కలయికలో సినిమా ఆగిపోవడానికి వెనుక ఉన్న కథ.