
ఈ విషయంలో నిర్మాతలంతా కలిసి ఒక కాల్ తీసుకోలేకపోతున్నారు..? పెరిగిన టికెట్ రేట్లు సినిమాకు వరమా..? శాపమా..? ఆడియన్స్కు కంఫర్టబుల్ ప్రైస్లో సినిమా చూపించలేరా..? అనేది అర్థం కావట్లేదిప్పుడు. ఒకప్పుడు పెద్ద సినిమా వస్తుందంటే అభిమానుల్లో ఉత్సాహం.. ఆడియన్స్లో చూడాలనే ఆసక్తి ఉండేది. కానీ ఇప్పుడలా కాదు.. భారీ సినిమా వస్తుంటే టికెట్ రేట్ గుర్తుకొచ్చి ప్రేక్షకుడికి గుండెదడ మొదలవుతుంది.

ఓ పెద్ద హీరో సినిమా చూడాలంటే టికెట్కు కనీసం 400 నుంచి 500 రూపాయలు ఖర్చు చేయాల్సి వస్తుందిప్పుడు. బడ్జెట్ లెక్కలు చూపి.. నిర్మాతలే అదనంగా పెంచేస్తున్నారు. ట్రిపుల్ ఆర్ నుంచి ఈ టికెట్ రేట్ల ఇష్యూ టాలీవుడ్లో నడుస్తుంది. ఆ సినిమాకు తెలంగాణ మల్టీప్టెక్స్లలో 450 రూపాయల రేట్ పెట్టారు. ఆ తర్వాత కేజియఫ్ 2, ఆచార్య సహా చాలా సినిమాలకు ఇదే కంటిన్యూ అయింది.

ఆ మధ్య గుంటూరు కారంకు ఇదే రేట్ ఉంది.. గతేడాది కల్కి, దేవరకు కంటిన్యూ అయింది. అంతెందుకు భారతీయుడు 2కు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ టికెట్ రేట్ పెట్టారు. పుష్ప 2కు అయితే ఏకంగా 800 రూపాయలు పెట్టారు. ఆ తర్వాత కూడా 10 రోజుల వరకు 500 రూపాయలు పెట్టకపోతే సింగిల్ టికెట్ ముక్క కూడా రాలేదు. మొన్న హరిహర వీరమల్లుకు కూడా భారీగానే పెంచేసారు.

ఆల్రెడీ తెలంగాణలో 295 రూపాయల టికెట్ రేట్ ఉన్నా.. అదనంగా 75 నుంచి 100 రూపాయలు పెంచుకుంటున్నారు నిర్మాతలు. రేట్ పెంచుకోకపోతే సినిమాపై నమ్మకం లేదేమో అనే డౌట్ వస్తుందని.. ప్రస్టేజ్ ఇష్యూగా తీసుకుంటున్నారు నిర్మాతలు. సంక్రాంతికి వస్తున్నాం, తండేల్ లాంటి మీడియం రేంజ్ సినిమాలకు కూడా టికెట్ రేట్లు పెంచేస్తున్నారు మేకర్స్. పెద్ద సినిమాలకైతే ఓకే గానీ.. నార్మల్ సినిమాలకు రేట్లు పెంచడమే సమస్యగా మారుతుంది.

హైక్స్ సినిమాను కాపాడాలి గానీ.. భస్మాసుర హస్తంగా మారకూడదు కదా..? ఇది అర్థం చేసుకునే ఈ మధ్య కొన్ని సినిమాలు మామూలు రేట్లతోనే విడుదలయ్యాయి. అలా చేసినా కూడా ఆడియన్స్ సినిమా చూస్తారనే గ్యారెంటీ లేదు. ఎందుకంటే వార్ 2, కూలీ సినిమాలకు ఎలాంటి రేట్లు పెరగలేదు అయినా కూడా ఆడియన్స్ చూడలేదు. మరోవైపు మిరాయ్ సినిమాకు రేట్లు పెంచబోమని చెప్పారు నిర్మాతలు. మిగిలిన సినిమాలకు కూడా ఇదే అప్లై చేస్తారా లేదా అనేది చూడాలి.