
రెండేళ్ళ కింద విజయ్ దేవరకొండతో ఖుషీ సినిమాలో నటించాక.. టాలీవుడ్ వైపు చూడట్లేదు సమంత. పూర్తిగా ఫోకస్ అంతా బాలీవుడ్పైనే పెట్టారు.. పైగా సినిమాల కంటే ఎక్కువగా వెబ్ సిరీస్లు మాత్రమే చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఫ్యామిలీ మ్యాన్ 2, సిటాడెల్ లాంటి సిరీస్లతో ముంబైకి మకాం మార్చేసారు స్యామ్. తాజాగా రక్త్ బ్రహ్మాండ్ అనే సిరీస్ చేస్తున్నారు.

సిటాడెల్ సెట్స్పై ఉన్నపుడే.. రక్త్ బ్రహ్మాండ్ సిరీస్ అనౌన్స్ చేసారు మేకర్స్. ఈ సిరీస్ కూడా రాజ్ డికేనే క్రియేట్ చేస్తున్నారు. ఏడాది కిందే మొదలుపెట్టిన ఈ సిరీస్ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తైంది. ఇన్డోర్ టాకీ అంతా పూర్తైందని.. ఔట్ డోర్ యాక్షన్ సీక్వెన్సుల కోసం రెడీ అవుతున్నట్లు తెలిపారు మేకర్స్. కానీ అంతలోనే ఈ సిరీస్ ఆగిపోయిందనే ప్రచారం మొదలైంది.

ఎగ్జిగ్యూటివ్ ప్రొడ్యూసర్ కారణంగా కోట్ల రూపాయల స్కామ్ జరగడంతో రక్త్ బ్రహ్మాండ్ను ఆపేయాలని నెట్ ఫ్లిక్స్ నిర్ణయించుకుందని వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అది నిజం కాదని.. నెక్ట్స్ షెడ్యూల్లో సమంతతో పాటు ఆదిత్య రాయ్ కపూర్ జాయిన్ అవుతారని చెప్పారు రాజ్ డీకే.

మరోవైపు శుభం సినిమాతో నిర్మాతగా మారిన సమంత.. మా ఇంటి బంగారంతో త్వరలోనే ప్రేక్షకులను పలకరించబోతున్నారు. రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాలో సమంత ఓ స్పెషల్ సాంగ్ చేయబోతున్నారని తెలుస్తుంది.

రంగస్థలంలో చరణ్, స్యామ్ కలిసి నటించారు. మళ్లీ ఈ కాంబో రిపీట్ అయ్యేలా కనిపిస్తుంది. ఏఆర్ రెహమాన్ ఈ స్పెషల్ సాంగ్కు అదిరిపోయే ట్యూన్ రెడీ చేస్తున్నారు. మొత్తానికి సమంత కోరుకుంటున్న రీ ఎంట్రీ పెద్దితో ఉంటుందేమో చూడాలి.