
సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు,హీరోయిన్స్ గా కొనసాగుతున్న వారిలో చాలామంది ఛైల్డ్ ఆర్టిస్టులుగా అలరించిన వారే. మహేశ్బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, అఖిల్, రాశి, మీనా, హన్సిక, షాలినీ, తమన్నా.. ఇలా లిస్టు చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. పై ఫొటోలో ఉన్న బాలయ్యతో ఉన్న ఇద్దరు చిన్నారులు కూడా ఈ కోవకు చెందిన వారే.

బాలనటులుగా టాలీవుడ్లోకి అడుగుపెట్టిన వీరిద్దరు ఆతర్వాత స్టార్ హీరో, హీరోయిన్లుగా బిజీ అయిపోయారు. వివరాల్లోకి వెళితే.. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రం బాలగోపాలుడు. సుహాసిని కథానాయికగా కనిపించింది. మోహన్ బాబు విలన్గా నటించాడు.ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

కాగా పల్లెటూరి నేపథ్యంగా తెరకెక్కిన బాలగోపాలుడు సినిమాలో అనాథ అన్నాచెల్లెళ్లుగా ఇద్దరు చిన్నారులు అద్భుతంగా నటించారు. పై ఫొటోలో ఉన్నది వారే. మరి వారెవరో గుర్తుపట్టారా.? ఈ చైల్డ్ ఆర్టిస్టులు మరెవరో కాదు నందమూరి కల్యాణ్ రామ్, హీరోయిన్ రాశి. బాలయ్య సినిమాలో ఈ ఇద్దరూ చైల్డ్ ఆర్టిస్ట్ లుగా నటించి మెప్పించారు.

బాలగోపాలుడు సినిమాలో కల్యాణ్ రామ్, రాశి అన్నా చెల్లెళ్లుగా నటించారు. సినిమాలో వీరి పాత్రలకు మంచి పేరొచ్చింది. అయితే ఈ సినిమా తర్వాత ఛైల్డ్ ఆర్టిస్టుగా మరే సినిమాలోనూ నటించలేదు కల్యాణ్ రామ్. రాశి మాత్రం బాలనటిగా తెలుగు, తమిళ్, కన్నడ, మళయాళ భాషల్లో సినిమాలు చేసింది.

విచిత్రం ఏంటంటే బాలయ్యతో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిన రాశి.. ఓ సినిమాలో ఆయన సరసన హీరోయిన్ గానూ నటించింది. ఆ సినిమాయే కృష్ణబాబు. ఈ సినిమాలో అబ్బాస్ కీలక పాత్రలో నటించాడు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1999లో విడుదలైంది. ఇలా బాలయ్య సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా చేసింది రాశి.