
మరికొద్ది నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. అయితే ఈ ఎలక్షన్లలో కొందరు సినీ ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందులో ప్రముఖంగా బాలీవుడ్ అందాల తార మాధురీ దీక్షిత్ పేరు బాగా వినిపిస్తోంది.

మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రానుందని, ముంబైలోని ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తనపై వస్తోన్న రూమర్లకు మాధురీ దీక్షిత్ స్వయంగా సమాధానమిచ్చింది. మాధురీ దీక్షిత్ తన కొత్త మరాఠీ చిత్రం 'పంచక్' ప్రమోషన్లో బిజీగా ఉంది. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె రాజకీయాల్లోకి రావడంపై క్లారిటీ ఇచ్చింది.

మాధురీ దీక్షిత్ రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, సినీ పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. ‘‘ఎన్నికల సమయంలో నేను పోటీ చేస్తాననే వార్తలు ప్రచారంలోకి వస్తాయి. కానీ, రాజకీయాలు నా అభిరుచి కాదు' అని కుండ బద్దలు కొట్టింది. ఇక తన పంచక్ సినిమా విజయం సాధిస్తే మరింత వేగంగా మూవీస్ చేస్తానని చెప్పుకొచ్చింది మాధురి.

మాధురీ దీక్షిత్ తన కుటుంబం గురించి కూడా మాట్లాడింది. తనకు కొంకణి భాష కూడా వస్తుదంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. 'నాకు కొంకణి అంతగా రాదు. కానీ నాకు అర్థమవుతుంది. అమ్మమ్మ కొంకణి పాటలు పాడేది. మా అమ్మ మరాఠీ మాట్లాడేది' అని మాధురీ దీక్షిత్ తెలిపింది. 1984లో బాలీవుడ్లోకి అడుగుపెట్టిందీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్. 'అబోద్' ఆమె మొదటి సినిమా. అప్పటికీ మాధురీకి ఇంకా 17 ఏళ్లే.

1988లో విడుదలైన ‘తేజాబ్’ సినిమా మాధురీ పాపులారిటీని పెంచింది. ఆ చిత్రంలోని 'ఏక్ దో థీన్..' పాట సూపర్ హిట్ అయింది. ఈ పాటలో మాధురి డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. 'తేజాబ్' సినిమా తర్వాత మాధురి స్టార్డమ్ పెరిగింది. స్టార్ హీరోలతో సమానంగా క్రేజ్ ను సొంతం చేసుకుంది. జనవరి 5న 'పంచక్' సినిమా విడుదల కానుంది. ఈ సినిమాపై చాలా ఆశలే పెట్టుకుంది మాధురి.