
సైబర్ నేరాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోంది. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. అంతేకాకుండా సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసేందుకు కొత్త పోర్టల్, యాప్ను కూడా ప్రవేశపెట్టింది. ఇక స్పామ్ కాల్స్ ద్వారా సైబర్ క్రిమినల్స్ ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. లోన్, క్రెడిట్ కార్డ్, బ్యాంక్ కేవైసీ అప్డేట్ పేరుతో ప్రజల బ్యాంక్ వివరాలు, ఓటీపీ తెలుసుకుని సొమ్ము కాజేస్తున్నారు.

ఈ క్రమంలో స్పామ్ కాల్స్కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కఠిన నిబంధనలు అమలు చేస్తోంది. ఈ క్రమంలో బ్యాంకింగ్, ఆర్ధిక సంస్థలకు ఒకే సిరీస్ నెంబర్లను కేటాయించింది. ఇక నుంచి ఆర్ధిక సంస్థలు కస్టమర్లకు 1600 సిరీస్ నెంబర్ నుంచే కాల్స్ చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు బ్యాంకింగ్, బీమా, ఫైనాన్షియల్ సంస్థలకు ఆదేశించింది.

జనవరి 1వ తేదీ నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. దీంతో లోన్ యాప్స్, బీమా కంపెనీలు, బ్యాంకులు, ఇతర ఆర్ధిక వ్యవహారాలకు సంబంధించిన కంపెనీలు 1600 సిరీస్ నెంబర్ ద్వారానే తమ కస్టమర్లకు కాల్స్ చేయాల్సి ఉంటుంది. దీని వల్ల స్పామ్ కాల్స్ బారిన పడకుండా ఉండటమే కాకుండా సైబర్ నేరాలను అడ్డుకోవచ్చు. ప్రజలు కూడా సులువుగా గుర్తించడానికి వీలవుతుంది.

+91 1600 అనే సిరీస్తో మొదలయ్యే నెంబర్ల నుంచి వచ్చే కాల్స్ మాత్రమే నిజమైన కాల్స్ అని మొబైల్ వినియోగదారులు అర్ధం చేసుకోవచ్చు. వేరే నెంబర్ల నుంచి వచ్చే ఫైనాన్షియల్ కాల్స్ నకిలీవి అని తెలుసుకోవచ్చు. దీని వల్ల స్పామ్ కాల్స్ను లిఫ్ట్ చేయకపోవడం వల్ల సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండవచ్చు.

కాగా దేశంలో ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరుగుతున్నాయి. సైబర్ క్రిమినల్స్ తెలివిగా అనుమానం రాకుండా జనాలను మస్కా కొట్టిస్తున్నారు. దీంతో లక్షలాది సొమ్మును దొచేసుకుంటున్నారు. చివరికి మోసపోయాక ప్రజలు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అప్పటికే నగదు ట్రాన్స్ఫర్ అవ్వడం వల్ల నేరగాళ్లను పట్టుకోవడం కష్టతరంగా మారుతుంది.