
ఎల్పీజీ గ్యాస్ వినియోగదారులకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. గ్యాస్ సిలిండర్లు వాడేవారు ఈకేవైసీ చేయించుకోవడాన్ని కేంద్రం తప్పనిసరి చేసిన విషయం తెలిసిందే. ఇందుకు ఆగస్ట్ 16వ తేదీ వరకు మాత్రమే గడువు విధించింది. అప్పటిలోగా ప్రతీఒక్కరూ తప్పనిసరిగా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. లేకపోతే సిలిండర్లు, గ్యాస్ కనెక్షన్ల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి.

ఈకేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ బుకింగ్, డెలివరీ పొందటంలో ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే కేవైసీ పూర్తి చేయాలని ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కస్టమర్లకు మెస్సేజ్లు పంపిస్తున్నాయి. కేవైసీ పూర్తి చేయకపోతే గ్యాస్ డెలివరీలో ఇబ్బందులతో పాటు సబ్సిడీ కూడా నిలిచిపోతుంది. కేంద్రం ప్రధానమంత్రి ఉజ్వల్ యోజన పథకం కింద గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీని అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సబ్సిడీ నిధులు ఆగిపోతాయి.

కేవైసీ పూర్తి చేసిన తర్వాత తిరిగి సబ్సిడీ నిధులు పొందవచ్చు. సబ్సిడీ సొమ్ము ఆగిపోకుండా ఉండాలన్నా, సిలిండర్ల డెలివరీలో ఇబ్బందులు ఎదుర్కొకుండా ఉండాలన్నా కేవైసీ తప్పనిసరిగా పూర్తి చేయాలి. కస్టమర్లు తమ పంపిణీ సంస్థ ద్వారా ఇంటి వద్ద నుంచే కేవైసీ పూర్తి చేయవచ్చు. ఈ మేరకు ఆయిల్ కంపెనీలు అవకాశం కల్పిస్తున్నాయి. ఇక గ్యాస్ ఏజెన్సీ కార్యాలయానికి వెళ్లి కేవైసీ ప్రాసెస్ పూర్తి చేయొచ్చు.

ఇక గ్యాస్ డెలివరీ చేయడానికి వచ్చే వ్యక్తి వద్ద ఉండే బయోమెట్రిక్ మెషిన్ ద్వారా కూడా కేవైసీ ప్రక్రియ పూర్తి చేయవచ్చు. ఈ మూడు విధానాల్లో సింపుల్గా కేవైసీ పూర్తి చేయవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. కేవైసీ కోసం తొలుత జులై 31 వరకు గడువు ఇచ్చారు. ఇప్పుడు ఆ గడువును ఆగస్ట్ 16 వరకు పొడిగించారు. దీంతో గ్యాస్ వినియోగదారులు ఇప్పటికైనా పూర్తి చేసుకోవాలి.

ఇక ఆగస్ట్ 1న కొత్త గ్యాస్ ధరలను ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల ధరలను రూ.209 వరకు తగ్గించారు. వరుసగా రెండో నెల కూడా ఈ సిలిండర్ ధర తగ్గింది. అయితే డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల ధరలను మాత్రం యథాతధంగా ఉంచారు