
పెట్టుబడిదారులకు లైఫ్ ఇన్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(LIC) భారీ శుభవార్త అందించింది. ఇన్వెస్టర్లకు బోనస్ ప్రకటించింది. ఒక షేర్ కొంటే మరో షేర్ అదనంగా ఇవ్వనుంది. ఈ మేరకు ఎల్ఐసీ బోర్డు సమావేశంలో నిర్ణయానికి ఆమోదం తెలిపారు. దీంతో ఇది ఎల్ఐసీలో ఇన్వెస్ట్ చేసేవారికి జాక్ పాట్గా చెప్పవచ్చు. 1:1 నిష్పత్తిలో ఈక్విటీ షేర్లను జారీ చేసేందుకు సిద్దమయ్యారు

ఇన్వెస్టర్లు కొనుగోలు చేసిన ప్రతీ షేర్కు అదనంగా ఉచితంగా మరో షేర్ వస్తుంది. ఉదాహరణకు మీరు 100 షేర్లు కలిగి ఉంటే మరో 100 వస్తాయి. దీంతో మీ షేర్లు 200కి పెరుగుతాయి. రికార్డు తేదీని ఇంకా ఎల్ఐసీ ప్రకటించలేదు. ఆ తేదీ నాటికి షేర్లు కలిగిన ప్రతీఒక్కరికీ బోనస్ షేర్లు యాడ్ కానున్నాయి.

వాటాదారులకు బోనస్ షేర్లను అందించేందుకు గత ఏడాది డిసెంబర్ 31 నాటిక ఉన్న మిగులు నిధులు, నిల్వలను వినియోగించనున్నారు. ఇందుకోసం రూ.6325 కోట్లు వినియోగించనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని రెగ్యూలేటరీ ఫైలింగ్లో ఎల్ఐసీ బోర్డు స్పష్టం చేసింది. స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ షేర్లను కొనుగోలు చేసినవారికి ఇది జాక్పాట్గా చెప్పవచ్చు.

ఏప్రిల్ 13న ఎల్ఐసీ బోర్డ్ డైరెక్టర్ల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో చర్చించిన అనంతరం బోనస్ షేర్లకు ఆమోదం తెలిపారు. అనంతరం ఎల్ఐసీ అధికారికంగా ప్రకటన చేసింది. అయితే స్టాక్ మార్కెట్లో ఎల్ఐసీ లిస్ట్ అయిన తర్వాత బోనస్ షేర్లను ఇప్పటివరకు ప్రకటించలేదు. తొలిసారి ఇన్వెస్టర్లకు బోనస్ షేర్లను ప్రకటించింది.

2 నెలల్లోగా బోనస్ షేర్లను అందించాలని ఎల్ఐసీ నిర్ణయించింది. దీంతో జూన్ 12లోగా ఇన్వెస్టర్లకు ఇవి అందుతాయని తెలుస్తోంది. ఎల్ఐసీ 2022లో స్టాక్ మార్కెట్లలో లిస్ట్ కాగా.. ఇప్పటివరకు డివిడెంట్ మాత్రమే ప్రకటించింది. అయితే బోనస్ షేర్లను ప్రకటించనుందనే వార్తల క్రమంలో ఎల్ఐసీ షేర్లు 8 శాతం వరకు పెరిగాయి