
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. గత రెండు రోజులుగా మళ్లీ పెరుగుదల నమోదవుతోంది. మొన్నటివరకు రెండు వారాల పాటు ధరలు పడిపోగా.. ఇప్పుడు మళ్లీ పెరుగుతుండటంతో కొనుగోలుదారులు షాక్ అవుతున్నారు. బంగారం ధరలు త్వరలో మరింత పెరుగుతాయనే అంచనాలు వెలువడుతున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఇన్వెస్టర్, రిచ్ డాడ్ పూర్ డాడ్ రచయిత రాబర్ట్ కియోసాకి సంచలన వ్యాఖ్యలు చేశారు.

రానున్న రోజుల్లో బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతాయని రాబర్ట్ కియోసాకి బాంబ్ పేల్చారు. బంగారం ఏకంగా ఔన్సుకు 35 వేల డాలర్లకు, వెండి ఔన్సుకు 200 డాలర్లకి పెరగవచ్చని అంచనా వేశారు. ఇక బిట్ కాయిన్ 750000 డాలర్లకు పెరిగే అవకాశముందని, ఇథీరియం 95 వేలకు పెరుగుతుందని అంచనా వేశారు. బంగారం, వెండి, బిట్ కాయిన్, రియల్ ఎస్టేట్, చమురు, ఎథేరియం, ఆహార ఉత్పత్తి వంటికి విలువైన ఆస్తులుగా మారుతాయని అభిప్రాయపడ్డారు.

ద్రవ్యోల్బణం, వ్యవస్ధాగత నష్టాల నుంచి రక్షణ కల్పించే ఆస్తులుగా పసిడి, బిట్ కాయిన్ ఉంటాయని రాబర్ట్ కియోసాకి తెలిపారు. సంపాదన అవకాశాలను నిర్థిష్ట ఆస్తులపై పెట్టుబడిదారులు దృష్టి పెట్టాలని కియోసాకి సూచించారు. తాను చిన్న పెట్టుబడులతో స్టార్ట్ చేశానని, తొలి రోజులలో 6 బిట్ కాయిన్లను మాత్రం కొనుగోలు చేశానన్నారు. వాటిని చాలాకాలం పాటు ఉంచుకున్నట్లు వివరించారు.

ప్రభుత్వం, బ్యాంకులు, వాల్ స్ట్రీట్ తారుమారు చేయలేని ఆస్తుల్లో్ తాను పెట్టుబడి పెడతానని రాబర్ట్ కియోసాకి స్పష్టం చేశారు. 2026లో స్టాక్ మార్కెట్ కుప్పకూలుతుందని, యుద్దాల క్రమంలో మార్కెట్లలో అనిశ్చితి నెలకొంటుందని వివరించారు. 2026లో ఆర్ధిక పతనం సంభవించవచ్చని, ఇది కొందరికి అవకాశంగా మారుతుందన్నారు. మరికొంతమందికి ఇది నష్టం చేకూర్చుతుందని తన అభిప్రాయలు తెలిపారు.

ఈ ఏడాదిలో మార్కెట్ కుప్పకూలుతుందని, దీనిని ముందు గమనించే పెట్టుబడిదారులు ప్రయోజనం పొందుతారని రాబర్ట్ కియోసాకి తెలిపారు. ముందుగానే సిద్దం కానివారు నష్టాలను ఎదుర్కొవాల్సి వస్తుందని హెచ్చరించారు. సరైన ఆస్తుల్లో పెట్టుబడులు పెట్టడానికి వ్యూహం రూపొందించుకోవాలని సూచించారు.