
దేశంలోని సుమారు 8 కోట్ల మంది ఉద్యోగులకు EPFO గుడ్ న్యూస్ చెప్పింది. పీఎఫ్ ఖాతాదారులు ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్లోని అర్హత గల మొత్తాన్ని నేరుగా UPI ద్వారా విత్డ్రా చేసుకునే సదుపాయాన్ని త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా వెల్లడించిన వివరాల ప్రకారం.. UPI పేమెంట్ గేట్వేకు సంబంధించిన పరీక్షలు విజయవంతంగా పూర్తయ్యాయి. దీంతో సభ్యులు తమ PF డబ్బును నిమిషాల్లోనే బ్యాంక్ ఖాతాల్లోకి పొందవచ్చని అన్నారు.

ప్రస్తుతం PF క్లెయిమ్ల ప్రాసెసింగ్కు 7 నుంచి 10 రోజుల వరకు సమయం పడుతోంది. కొన్ని సందర్భాల్లో లక్ష రూపాయలకు మించిన ఉపసంహరణలకు మాన్యువల్ వెరిఫికేషన్ అవసరం కావడం, డాక్యుమెంట్లలో చిన్న పొరపాట్లు ఉన్నా క్లెయిమ్లు నిలిచిపోవడం వంటి సమస్యలు ఉన్నాయి. అయితే EPFO 3.0 ఫ్రేమ్వర్క్ అమల్లోకి వచ్చిన తర్వాత ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్గా మారనుంది. యజమాని ఆమోదం కోసం వేచి ఉండాల్సిన అవసరం తగ్గిపోగా, పేపర్ లెస్ విధానంలో క్లెయిమ్లు వేగంగా పరిష్కారమవుతాయి.

ఈ కొత్త విధానంలో సభ్యులు UMANG యాప్ ద్వారా తమ PF ఖాతాలోని అర్హత గల బ్యాలెన్స్ను చూసుకోవచ్చు. అనంతరం UPI పిన్ ఉపయోగించి ఆ మొత్తాన్ని నేరుగా తమ బ్యాంక్ ఖాతాలోకి బదిలీ చేసుకోవచ్చు. అనారోగ్యం, విద్య, వివాహం, గృహ అవసరాలు వంటి అత్యవసర సందర్భాల్లో మూడు రోజుల్లోపే నిధులు పొందే అవకాశం ఉంటుంది.

అయితే మొత్తం PF బ్యాలెన్స్ను ఉపసంహరించుకునే అవకాశం ఉండదు. పదవీ విరమణ నిధుల భద్రత కోసం కనీసం 25 శాతం మొత్తం ఖాతాలోనే కొనసాగుతుంది. మిగిలిన అర్హత గల 50 నుంచి 75 శాతం వరకు మాత్రమే UPI లేదా ATM ద్వారా విత్డ్రా చేసుకోవచ్చు. యాప్లో ‘ఎలిజిబుల్ బ్యాలెన్స్’ ప్రత్యేకంగా చూపించబడుతుంది.

ఈ సదుపాయాన్ని పొందాలంటే సభ్యులకు యాక్టివ్ UAN ఉండాలి. అలాగే ఆధార్, పాన్ కార్డులు UANకు లింక్ అయి ధృవీకరించబడి ఉండాలి. PF రికార్డుల్లోని పేరు, పుట్టిన తేదీ వివరాలు ఆధార్లో ఉన్న వివరాలతో పూర్తిగా సరిపోవాలి. ఇక సభ్యులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు EPFO తన సేవలను వాట్సాప్ చాట్బాట్తో కూడా అనుసంధానించనుంది. దీంతో ఒక మెసేజ్ పంపడం ద్వారా PF బ్యాలెన్స్, విత్డ్రాయల్ అర్హత వంటి వివరాలను సులభంగా తెలుసుకునే అవకాశం లభించనుంది. EPFO 3.0 అమలు భారత ఉద్యోగుల పదవీ విరమణ నిధుల నిర్వహణలో కీలక మలుపుగా భావిస్తున్నారు.