
ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(EPFO) జూలై 3వ తేదీన అప్గ్రేడ్ చేసిన ఈపీఎఫ్ఓ పోర్టల్ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. పునరుద్దరించిన ఈ సైట్లో కొన్ని సేవలు పనిచేసే విధానంలో ముఖ్యమైన మార్పులు వచ్చాయి. యూనివర్సల్ అకౌంట్ నంబర్ (UAN) యాక్టివేషన్, కొత్త UAN జనరేషన్ సేవలు ఉమాంగ్ యాప్కు మార్చారు. ఖాతాదారులు ఇకపై వారి యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ ద్వారా నేరుగా యూఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేసుకోలేరు

అప్గ్రేడ్ తర్వాత ఈ పాత ఆప్షన్లను పోర్టల్ నుండి తొలగించారు. ఇక నుంచి యూఏఎన్ యాక్టివేట్ చేయడానికి ఉమాంగ్ యాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ యాప్లో ఈపీఎఫ్ఓ సేవలను ఎంచుకోవాలి. 'UAN Services Through Face Auth' ఆప్షన్ ఎంచుకోవాలి. అనంతరం 'UAN Activation'ను ఎంచుకోవాలి. ఈ ప్రక్రియకు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ కూడా అవసరం పడుతుంది.

ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా UAN కేటాయింపును కూడా నిలిపివేశారు. కొత్త UAN అవసరమైన వారు ఉమాంగ్ యాప్ను ఉపయోగించాల్సి ఉంటుంది. UANను రూపొందించి యాక్టివేట్ చేయడానికి ముందు ఆధార్ ఆధారిత ఫేస్ అథెంటికేషన్ కూడా ఇక నుంచి అవసరం. ఈ మేరకు నూతన మార్పులు చేశారు.

ఇక యూఏఎన్ నెంబర్ను యాక్టివేట్ చేసుకునే విధానం మారింది. ముందుగా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ను ధృవీకరించాలి. ఆ తర్వాత వివరాలు అందించి ఆధార్ బేస్డ్ ఫేషియల్ రికగ్ననైషన్ పూర్తి చేయాలి. ఆ తర్వాత కొత్తగా రూపొందించిన UANను ప్రస్తుత PF ఖాతాతో అనుసంధానించుకోవచ్చు.

పెన్షన్, మరణ క్లెయిమ్ సేవలు యూనిఫైడ్ మెంబర్ పోర్టల్లోనే కొనసాగుతాయి. ఈ సేవ కోసం లబ్ధిదారులు ఉమాంగ్కు మారాల్సిన అవసరం లేదు. క్లెయిమ్ సమర్పించే ముందు ఆధార్తో లింక్ అయిన మొబైల్ నంబర్ యాక్టివ్గా ఉందని ధృవీకరించారు. చెల్లింపు కోసం బ్యాంకు ఖాతా వివరాలు అందుబాటులో ఉన్నాయని నిర్ధారించుకోవాలి.