
ఏ బ్యాంకుకైనా డిపాజిట్లు అనేవి చాలా ప్రాధానమైనవని చెప్పవచ్చు. ఎందుకంటే వీటినే ఇతర కస్టమర్లకు రుణాలుగా బ్యాంకులు అందిస్తాయి. డిపాజిట్లు ముఖ్యం గనుక వీటిని జమ చేసే ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పించడం అనేది చాలా ముఖ్యం. ఇందుకోసం డిపాజిట్లకు ఇన్యూరెన్స్ సౌకర్యం అందుబాటులో ఉంది. అయితే ఇందుకోసం ఖాతాదారుడు ఎలాంటి ప్రీమియం చెల్లించనక్కర్లేదు. బ్యాంకులే ప్రీమియంను చెల్లిస్తాయి.

ఖాతాదారులు బ్యాంకుల్లో జమ చేసే డిపాజిట్లకు డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ (డిఐసిజిసి) రక్షణ కల్పిస్తోంది. ఆర్బీఐ ఆధ్వర్యంలో ఈ కార్పొరేషన్ నడుస్తుంది. ఖాతాదారుడు జమ చేసే డబ్బుతో పాటు దానిపై వచ్చే వడ్డీకి కూడా ఇన్యూరెన్స్ వర్తిస్తుంది. డిపాజిట్లపై రూ.5 లక్షల వరకు బీమా కవరేజీని అందిస్తుంది. ఈ బీమా కవరేజీని పెంచాలనే డిమాండ్లు కూడా వినిపిస్తున్నాయి.

31 మార్చి 2025 నాటికి మొత్తం బ్యాంకు డిపాజిట్ ఖాతాల్లో 97.6 శాతం ఖాతాలకు బీమా వర్తిస్తుంది. DICGC 293.7 కోట్ల డిపాజిట్ అకౌంట్లకు బీమా కల్పించింది. బీమా చేయబడిన డిపాజిట్ల విలువ 41.5 శాతం వద్ద తక్కువగా ఉంది. డిపాజిట్ ఖాతాలన్నింటిలో బీమా అందుబాటులో ఉన్న మొత్తం డిపాజిట్ల విలువ రూ.240 లక్షల కోట్లుగా ఉంది. అయితే వీటల్లో రూ.100 లక్షల కోట్ల డిపాజిట్లు మాత్రమే DICGC వద్ద బీమా చేసి ఉన్నాయి.

ఇక మిగిలిన రూ.140 లక్షల కోట్లు బీమా చేయలేదు. ఇవి రూ.5 లక్షల కంటే ఎక్కవ డిపాజిట్లు చేసినవి. డిపాజిట్ విలువకు కవరేజ్ 41.5 శాతం తక్కువగా ఉంది. DICGC 1961 డిపాజిట్ ఇన్సూరెన్స్, క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ చట్టం కింద స్థాపించారు. డిఐసిజిసి ప్రారంభమైనప్పటి నుండి నేటి వరకు బీమా కవరేజ్ పెరిగింది.

డిపాజిట్ బీమా కవరేజీని చివరిసారిగా 2020లో రూ.లక్ష నుండి రూ.5 లక్షలకు పెంచారు. గత 6 సంవత్సరాలుగా బీమా కవరేజీ రూ.5 లక్షలుగానే ఉంది. డిపాజిట్ను కలిగి ఉన్న బ్యాంకు, డిపాజిట్ బీమా కోసం DICGCకి ప్రీమియం చెల్లిస్తుంది. బ్యాంకు డిపాజిటర్ నుండి డిపాజిట్ బీమా ప్రీమియం వసూలు చేయబడదు. ప్రభుత్వం డిపాజిట్ బీమా పరిధిని పెంచితే.. బ్యాంకులు DICGCకి చెల్లించే ప్రీమియం మొత్తం పెరుగుతుంది.