
ఇది పరీక్షల సమయం. విద్యార్ధులు పుస్తకాలతో కుస్తీ పడుతుంటే.. తల్లిదండ్రులు వారి ఏకాగ్రత మారకుండా ఉండేందుకు వీలైనంత వరకు తమ ప్రోగ్రామ్లను సైతం వాయిదా వేసుకుంటున్నారు. అయితే విద్యార్ధులు హుషారుగా చదివి, సిలబస్ మొత్తం పూర్తి చేద్దామని పూనుకొంటే.. పాయసంలో పలుకురాళ్లలాగా బుర్ర హీటెక్కిపోయి మారం చేస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు దృష్టి మళ్లీ పుస్తకంపైకి మళ్లాలంటే నిపుణులు అద్భుత చిట్కాలు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం..

తక్కువ సమయంలోనే ఎక్కువ సబ్జెక్టులు చదవాలంటే అయ్యే పని కాదు. మరి ఈ ఇబ్బందిని అధిగమించడం ఎలా? అని ఆలోచించి చేతిలోకి ఫోన్ తీసుకున్నారో మీ టైం మొత్తం హుష్. ఇలా జరగకుండా ఉండాలంటే చదివేటప్పుడు కూర్చొనే విధానం చాలా ముఖ్యం. చాలా మంది టేబుల్పై పుస్తకాలు పెట్టుకుని.. కుర్చీలో కూర్చుని చదువుతుంటారు. నిజానికి ఇది చాలా అనువైన పద్ధతే. కానీ కొందరు ఎక్కువ సేపు ఒకే భంగిమలో కూర్చుని చదవడం వల్ల విసుగు అనిపిస్తుంది.

ఇలాంటప్పుడుకూర్చొని చదువుతున్నప్పుడు తరచూ నీళ్లు తాగడం అలవాటు చేసుకోవాలి. బాడీని హైడ్రేటెడ్గా ఉంచుకోవాలి. డీహైడ్రేట్ అయితే.. అలసట, తలనొప్పికి గురై చురుకుదనాన్ని కోల్పోతారు. కొందరైతే రాత్రి సమయంలో బెడ్ లైటు వెలుగులోనే చదువుతుంటారు. దీంతో వెలుతురు తక్కువై చురుగ్గా ఉండలేరు. తద్వారా మగతగా అనిపిస్తుంది.

వాటి నుంచి బయటపడటానికి ఎంతగానో కృషిచేసే విద్యార్థులు ఎందరో ఉంటారు. ఈ క్రమంలో చిన్న లక్ష్యాలనూ పెట్టుకోవాలి. అప్పుడే గమ్యాన్ని చేరుకోవడం సులువవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. కోర్సులో చేరిన వెంటనే పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకుని విద్యా సంవత్సరం చివరిలోగా దాన్ని సాధించేద్దామని ఊహించుకుంటే సరిపోదు. గమ్యాన్ని చేరుకునే ప్రయాణంలో మరికొన్ని చిన్న లక్ష్యాలూ అవసరం అవుతాయి.

వార్షిక పరీక్షల్లో మంచి మార్కులు సాధించమే మీ లక్ష్యమైతే అందుకు రోజువారీ స్టడీ ప్లాన్ తప్పనిసరిగా వేసుకోవాలి. ప్రతిరోజూ అందుకోసం ప్రతి సబ్జెక్టు చదవడానికీ సమయాన్ని కేటాయించాలి. ప్రణాళిక వేసుకోవడం, దాన్ని అమలుచేయడం రెండూ ముఖ్యమే. ఆచరించకపోతే కష్టపడినా ప్రయోజనం ఉండదు.