
కావలసిన పదార్థాలు: 1/2 కప్పు కందిపప్పు, 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 1/2 కప్పు పెసరపప్పు, 1/4 కప్పు మినప్పప్పు, 50 గ్రాములు ఎండుమిరపకాయలు, 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 2 టేబుల్ స్పూన్ల శొంఠి పొడి, పావు టీస్పూన్ ఇంగువ, రుచికి సరిపడా రాళ్ల ఉప్పు.

తయారీ విధానం: బాండీని స్టవ్ మీద పెట్టి ఒక్క చుక్క కూడా నూనె వేయకుండా డ్రై రోస్ట్ చేయాలి. ఒక్కో పప్పు వేగడానికి ఒక్కో సమయం పడుతుంది కాబట్టి అన్నింటినీ ఒకేసారి కాకుండా విడివిడిగా వేయించుకోవాలి. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, మినప్పప్పులను వరుసగా లో ఫ్లేమ్లో మంచి సువాసన వచ్చి, దోరగా బంగారు రంగు మారే వరకు ఓపికగా వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి.

లోపలి వరకు వేగితేనే పచ్చివాసన పోయి పొడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అదే పాన్లో ఎండుమిరపకాయలను వేసి మంట తగ్గించి వేయించాలి ముఖ్యంగా మాడకుండా చూసుకోవాలి. ఆ తర్వాత జీలకర్ర, ఇంగువ వేసి పాన్ వేడికే ఒక్క నిమిషం వేపి స్టవ్ కట్టేయాలి. వేయించిన పప్పులు, దినుసులు పూర్తిగా గది ఉష్ణోగ్రతకు చల్లారే వరకు వేచి ఉండాలి. వేడి మీద మిక్సీ పడితే ఆవిరికి పొడి ముద్దవుతుంది.

ముందుగా మిక్సీ జార్లో వేయించిన ఎండుమిర్చి, జీలకర్ర, శొంఠి, ఉప్పు వేసి బరకగా తిప్పాలి. ఆ తర్వాత చల్లారిన పప్పులన్నీ వేసి కాస్త రవ్వలా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తటి పౌడర్లా కాకుండా కొద్దిగా బరకగా ఉంటేనే అన్నంలో కలుపుకున్నప్పుడు పంటి కింద పప్పులు క్రంచీగా తగులుతాయి.

పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరిస్తే 2-3 నెలల పాటు తాజాగా ఉంటుంది. వేడివేడి నెయ్యి అన్నంలోకి మాత్రమే కాకుండా.. వేడి ఇడ్లీలు, నెయ్యి కారం దోశలపై ఈ పొడి చల్లుకుంటే ఆ రుచి నెక్స్ట్ లెవెల్!