పెషావర్లో విషాదం.. ఆటాడుకుంటుండగా పేలిన గ్రేనేడ్.. ఇద్దరు పిల్లలు మృతి, మరో ముగ్గురికి సీరియస్
గ్రేనేడ్తో ఆడుకుంటుండగా పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు.
పాకిస్తాన్లో విషాదం చోటుచేసుకుంది. ఆట వస్తువుగా భావించి గ్రేనేడ్తో ఆడుకుంటుండగా పేలుడు సంభవించి ఇద్దరు చిన్నారులు దుర్మరణం పాలయ్యారు. రోడ్డు మీద దొరికిన గ్రేనేడ్ను ఇంటికి తీసుకువెళ్లారు ఆ అమాయకపు చిన్నారులు. దాన్ని ఆట వస్తువుగా భావించి ఇతర పిల్లలతో కలిసి ఆడుకుంటుండగా ఒక్కసారిగా పేలడంతో ఇద్దరు చిన్నారులు మృతిచెందగా, మరో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉందని స్థానిక అధికారులు తెలిపారు. ఖైబర్ ఫక్తున్సా ప్రావిన్సులోని పెషావర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. నగరంలోని నార్త్ వెస్ట్ ప్రాంతంలో పిల్లలు ఆడుకుంటుండగా వాళ్లకు గ్రేనేడ్ దొరికిందని, దాన్ని ఇంటికి తీసుకు వెళ్లిన తర్వాత అది పేలినట్లు స్థానిక పోలీసు అధికారి తెలిపారు.
ఆఫ్ఘనిస్తాన్లో సరిహద్దులో ఉన్న పెషావర్లో తరుచూ మిలిటెంట్ల దాడులు జరుగుతుంటాయి. ఆ ప్రాంతంలో ఇప్పటికీ వాడని ఆయుధాలు, పేలుడు పదార్థాలు దొరుకుతూనే ఉంటాయని పోలీసులు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. కాగా, పెషావర్ పరిసర ప్రాంతాల్లో ఇంకా ఎమైనా పేలని ఆయుధాలు ఉన్నాయేమోనని తనిఖీలు చేపట్టినట్లు పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.