APSRTC : ఏపీఎస్ ఆర్టీసీ సరికొత్త యాప్..అన్ని సేవలు అందులోనే..బుక్ చేసుకున్న బస్ మిస్సయితే..నెక్ట్స్ సర్వీస్లో వెళ్లొచ్చు
ఒకటి కాదు..రెండు కాదు..దాదాపు 15 సేవలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ అవుతుంది. ఇందుకోసం యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ (గతంలో ప్రథమ్) ప్రవేశపెట్టబోతుంది.

ఒకటి కాదు..రెండు కాదు..దాదాపు 15 సేవలను ఒకే యాప్ ద్వారా అందించేందుకు ఏపీఎస్ఆర్టీసీ రెడీ అవుతుంది. ఇందుకోసం యూనిఫైడ్ టికెటింగ్ సొల్యూషన్ యాప్ (గతంలో ప్రథమ్) ప్రవేశపెట్టబోతుంది. ప్రస్తుతం ఆర్టీసీలో ఆన్లైన్ అడ్వాన్స్ టికెట్ బుకింగ్, బస్ ట్రాకింగ్, పార్శిల్ బుకింగ్లకు మూడు వేర్వేరు యాప్లున్నాయి. ఇకపై ఈ సర్వీసులన్నీ ఒకే యాప్ లో లభ్యమవ్వనున్నాయి. దీని ద్వారా ముందుగా టికెట్ బుక్ చేసుకున్న బస్ను పాసింజర్ సమయానికి అందుకోలేకపోయినా.. అదే రూట్లో తర్వాత వచ్చే మరో సర్వీసులోకి మార్చుకునే అవకాశం రానుంది. రన్నింగ్ బస్లో సైతం ఎన్ని సీట్లు ఖాళీ ఉన్నాయో చూసుకొని వాటిని యాప్లో బుక్ చేసుకునే సౌకర్యం కూడా అందుబాటులోకి రానుంది. సెంట్రల్ కమాండ్ సెంటర్, ట్రాకింగ్ డివైజులు, సర్వర్, ఈ పోస్ మెషీన్స్ తదితరాల కోసం ఈ ప్రాజెక్ట్ మొత్తానికి రూ.70 కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.
డిజిటలైజేషన్ ప్రోత్సాహంలో భాగంగా ఈ ప్రాజెక్ట్కు కేంద్రం రూ.10-20 కోట్లు సాయం అందించనుంది. వచ్చే నెలలో టెండర్లు పిలవనున్నారు. ఇప్పటికే నాలుగు సంస్థలు ఇంట్రస్ట్ చూపిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. యాప్ ద్వారా బుక్ అయ్యే ఒక్కో టికెట్కు సగటున 15 పైసల చొప్పున టెండరు దక్కించుకునే సంస్థకు కమిషన్కు లభించే వీలుందని తెలుస్తోంది. పల్లెవెలుగు, సిటీ బస్సులు మొదలుకొని దూర ప్రాంతాలకు వెళ్లే అన్ని తరహా బస్సుల టికెట్లను యాప్లో బుక్ చేసుకోవచ్చు. ప్రతి బస్సు ట్రాకింగ్లో కనిపిస్తుంది. ఎంత సమయానికి బస్టాండ్ వస్తుందో చూసుకొని ప్రయాణికులు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికి ఆన్లైన్ టికెట్ బుకింగ్ సదుపాయం ఉన్న బస్సుల ట్రాకింగ్ మాత్రమే అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. డ్రైవర్లు, కండక్టర్లు వద్ద ఉండే టిమ్ల స్థానంలో ఆండ్రాయిడ్ ఇ-పోస్ మెషీన్స్ ఇస్తారు. దీని ద్వారా ప్రతి టికెట్ కొనుగోలు అందులో రికార్డవుతుంది. హెడ్ ఆఫీసులో సర్వర్ ద్వారా వివరాలు అప్డేట్ అవుతాయి.