నేడు కంగనా రాకతో ముంబైలో టెన్షన్ !

| Edited By:

Sep 09, 2020 | 9:26 AM

బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ ముంబైకి బయలుదేరారు. ముంబైలో అడుగుపెట్టనివ్వమంటూ శివసేన వార్నింగ్ ఇచ్చిన నేపథ్యంలో కేంద్రం కంగనాకు వై కేటగిరి భద్రత ఏర్పాటు చేసింది.

నేడు కంగనా రాకతో ముంబైలో టెన్షన్ !
Follow us on

బాలీవుడ్‌ నటి కంగనారనౌత్‌ ముంబైకి బయలుదేరారు. హిమాచల్‌ ప్రదేశ్‌ మండి జిల్లాలోని భన్వలా నుంచి కొద్దిసేపటి క్రితమే కంగనా బయలుదేరారు. మరికొద్ది గంటల్లోనే కంగనా ముంబైకి చేరుకోనున్నారు. తన స్వస్థలంలో కొవిడ్‌ టెస్టులు చేయించుకోగా కంగనాకు నెగెటివ్‌ వచ్చింది. ముంబై కరోనా నిబంధనలతో క్వారంటైన్‌ చేస్తారనే సమాచారంతోనే ముందు జాగ్రత్తగా కంగనా కరోనా టెస్టులు చేయించుకున్నారు.

మరోవైపు కంగనాను ముంబైలో అడుగుపెట్టనివ్వమంటూ శివసేన వార్నింగ్ ఇచ్చింది. దీంతో కేంద్రం కంగనాకు వై కేటగిరి భద్రత ఏర్పాటు చేసింది. ఆమెకు కేంద్ర హోంశాఖ భారీ సెక్యూరిటీ కల్పించింది. 11 మంది సీఆర్‌పీఎఫ్‌ సిబ్బంది భద్రతతో కంగనా ముంబైకి బయలుదేరారు.

ముంబైని పీవోకేతో పోల్చడంపై శివసేన, కంగన మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కంగనా రనౌత్‌కు వ్యతిరేకంగా శివసేన పార్టీ కార్యకర్తలు ఆందోళనలు చేసే అవకాశం ఉండటంతో ముంబైలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కంగనాకు డ్రగ్స్‌ మాఫియాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర హోంమంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ సంచలన ఆరోపణలు చేశారు. మహారాష్ట్ర పోలీసులు ఈ వ్యవహారంపై దర్యాప్తు చేస్తున్నారని వెల్లడించారు.

అయితే మహారాష్ట్ర మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఆరోపణలపై కంగనా ఘాటుగా కౌంటరిచ్చారు. డ్రగ్స్‌ తీసుకున్నట్టు నిరూపించాలని, డ్రగ్స్‌ టెస్ట్‌కు తాను సిద్దమని ట్వీట్‌ చేశారు. తనకు డ్రగ్‌ మాఫియాతో లింకులు ఉన్నాయని రుజువైతే ముంబైలో ఎప్పుడూ అడుగుపెట్టబోనని ట్వీట్‌ చేశారు.

మరోవైపు ముంబైలోని కంగనా ప్రొడక్షన్‌ హౌజ్‌ కార్యాలయానికి ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌ అధికారులు నోటీసులు అంటించారు. అనుమతి లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టరాదని నోటీసుల్లో పేర్కొన్నారు.