Tamil Nadu: ప్రభుత్వ మార్పుపై అజిత్ వ్యాఖ్యలంటూ ప్రచారం.. అసలు ఏం జరిగింది?

తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు అజిత్ కుమార్, గురువారం (ఏప్రిల్ 23, 2026) జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు. ఎప్పుడూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే అజిత్, అందరికంటే ముందుగా ఉదయాన్నే ఓటు వేసిన మొదటి స్టార్‌గా నిలిచారు.

Tamil Nadu: ప్రభుత్వ మార్పుపై అజిత్ వ్యాఖ్యలంటూ ప్రచారం.. అసలు ఏం జరిగింది?
Actor Ajith Kumar

Updated on: Apr 23, 2026 | 2:09 PM

తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న నటుడు అజిత్ కుమార్, గురువారం (ఏప్రిల్ 23, 2026) జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తన ప్రజాస్వామ్య బాధ్యతను చాటుకున్నారు. ఎప్పుడూ క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే అజిత్, అందరికంటే ముందుగా ఉదయాన్నే ఓటు వేసిన మొదటి స్టార్‌గా నిలిచారు.

ఇటీవలే బెల్జియంలో జరిగిన కార్ రేసింగ్ పోటీల్లో తన బృందంతో కలిసి పాల్గొన్న అజిత్, భారతదేశం తరపున రెండవ బహుమతిని సైతం గెలుచుకున్నారు. ఈ అంతర్జాతీయ విజయం తర్వాత బుధవారం (ఏప్రిల్ 22) చెన్నై చేరుకున్న ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ఉదయం 7 గంటల లోపే తిరువాన్మియూర్ పోలింగ్ కేంద్రానికి చేరుకున్నారు. తెల్లటి కోట్ సూట్, సన్ గ్లాసెస్ ధరించి ఎంతో స్టైలిష్‌గా వచ్చిన అజిత్‌ను చూసి అభిమానులు కేరింతలు కొట్టారు. ఓటు వేసి చిరునవ్వుతో తిరిగి వచ్చిన నటుడు అజిత్ కుమార్, అభిమానుల పట్ల తన హృదయాన్ని సరళంగా చూపించి వెళ్ళిపోయారు. విలేకరులు ఆయనతో మాట్లాడటానికి ప్రయత్నించినప్పుడు, ఆయన ఏమీ మాట్లాడలేదు.

అయితే, ఈ ఓటింగ్ ప్రక్రియ అనంతరం ఒక వివాదం నెట్టింట చక్కర్లు కొట్టింది. “ప్రభుత్వంలో మార్పు కోరుకుంటున్నారా?” అని విలేకరులు ప్రశ్నించగా, అజిత్ “వద్దు” అని సమాధానం ఇచ్చారనే వార్త వైరల్ అయ్యింది. దీనిపై అభిమానులు, రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. వెంటనే స్పందించిన అజిత్ మేనేజర్ సురేష్ చంద్ర, ఈ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు. అజిత్ విలేకరులతో మాట్లాడలేదని, ఆయన పేరుతో తప్పుడు ప్రచారం జరుగుతోందని క్లారిటీ ఇచ్చారు. సినిమా షూటింగ్‌లు, రేసింగ్ పనులతో బిజీగా ఉన్నప్పటికీ, బాధ్యతగల పౌరుడిగా అజిత్ ఓటు వేయడం పట్ల సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వార్త ప్రస్తుతం ఇంటర్నెట్‌లో తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us