పరీక్షల సమయంలో విద్యార్థులు ఎదుర్కొనే ఒత్తిడిని ఎలా అధిగమించాలన్న అంశాలపై ప్రతీ ఏటా ప్రధాని నరేంద్ర మోదీ పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ఈసారి కూడా ప్రారంభించారు. ఢిల్లీ తల్కతోరా స్టేడియంలో శుక్రవారం 11 గంటలకు పరీక్షా పే చర్చ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రధాని విద్యార్థులను, వారి తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడారు.
తల్కతోరా స్డేడియంలో 200 మంది విద్యార్థులు హాజరయ్యారు. విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా ప్రధాని చెప్పిన విషయాలను ఆలకించారు. వీరితో పాటు దేశంలోని పలు చోట్ల నుంచి వేలాది మంది విద్యార్థులతో ప్రధాని మోదీ వర్చువల్గా మాట్లాడారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. పేరెంట్స్ తమ స్టేటస్ కోసం పిల్లలపై ఒత్తడి పెట్టొదని సూచించారు. ఇక పరీక్షా పే చర్చ తనకు కూడా పరీక్షేనని అన్న ప్రధాని.. కోట్లాది మంది విద్యార్థులు తన పరీక్షకు హాజరవుతున్నారని, ఇందుకు తనకు సంతోషంగా ఉందని తెలిపారు.
విద్యార్థులను కేవలం చదువు విషయంలోనే ఒత్తిడి పెంచొద్దని, ఇతర విషయాల్లోనూ వారిని ప్రోత్సహించాలని మోదీ పిలుపునిచ్చారు. విద్యార్థులను ఒత్తిడిని ప్రధాని క్రికెట్తో పోల్చారు. విద్యార్థులు తమ సామర్థ్యాలను తక్కువ చేసుకోకూడదని, జీవితంలో టైం మేనేజ్మెంట్ అతి ప్రధానమని తెలిపారు. తల్లుల నుంచి టైం మేనేజ్మెంట్ నేర్చుకోవాలని విద్యార్థులకు సూచించారు.
ఇక పరీక్షల్లో కాపీ గురించి కూడా ప్రధాని మాట్లాడుతూ... జీవితంలో పరీక్షలు వస్తాయి పోతాయి, కానీ జీవితాన్ని గడపాలని తెలిపారు. పరీక్షల కోసం షార్ట్కార్ట్స్ వెతుక్కొవదన్న మోదీ.. కాపీ చేయడం కంటే చదువుపై దృష్టి సారించాలని పిలుపునిచ్చారు. కాపీ చేస్తే ఒక్క పరీక్షలో నెగ్గొచ్చు, కానీ జీవితాన్ని నెగ్గలేరు అంటూ విద్యార్థులకు హితబోధ చేశారు. ఇక అంతకు ముందు చిన్నారులు ఏర్పాటు చేసిన స్టాల్స్ను ప్రధాని వీక్షించారు.