
ముంబై, జులై 16: అమెరికన్ కంటెంట్ క్రియేటర్ లిజ్ ఇటీవల ముంబైలో ఉండగా రక్త పరీక్ష చేయించుకోవాల్సి వచ్చింది. సాధారణంగా అమెరికాలో మాదిరిగా డయాగ్నస్టిక్ సెంటర్కు వెళ్లి, వేచి ఉండి పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని ఆమె భావించింది. అయితే పరీక్ష కోసం ఫోన్ చేయగానే, ఆస్పత్రి సిబ్బంది ఆమెను కేంద్రానికి రావాల్సిన అవసరం లేదని, ఇంటికే టెక్నీషియన్ వచ్చి రక్త నమూనా సేకరిస్తారని తెలిపారు. కొద్ది సేపటికే ఆరోగ్య సిబ్బంది ఆమె ఇంటికి చేరుకుని, కేవలం 5 నిమిషాల్లోనే రక్త నమూనా సేకరణ ప్రక్రియను పూర్తి చేశారని తెగ ఆశ్చర్యపోతూ spicygori అనే యూజర్ ఐడీతో ఇన్స్టాలో పోస్టు చేసింది.
సేవల సౌకర్యం లిజ్ను ఆకట్టుకోగా, దాని ఖర్చు మరింత ఆశ్చర్యపరిచింది. అమెరికాలో అదే పరీక్షకు చెల్లించాల్సిన మొత్తంతో పోలిస్తే, భారత్లో ఖర్చు దాదాపు పదోవంతు మాత్రమేనని ఆమె తెలిపింది. అందుకే ఇంటి వద్దకే వచ్చి నమూనా సేకరించినందుకు అదనపు ఛార్జీలు వసూలు చేస్తారని భావించానని చెప్పింది. కానీ అలాంటిదేమీ జరగలేదు. హోమ్ కలెక్షన్ సేవ పూర్తిగా ఉచితమని తెలుసుకుని ఆమె ఆశ్చర్యపోయింది. ‘ఇది భారత్లోనే సాధ్యం. పరీక్ష ఖర్చే అమెరికాతో పోలిస్తే చాలా తక్కువ. అందుకే ఇంటి వద్ద సేవకు అదనపు చార్జీలు ఉంటాయని అనుకున్నాను. కానీ అది కూడా ఉచితమే’ అని లిజ్ తన పోస్టులో పేర్కొంది. ఈ వీడియో ప్రస్తుతం 18 లక్షలకు పైగా వీక్షణలతో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
లిజ్ వీడియోకు స్పందించిన పలువురు నెటిజన్లు భారత్లోని ఆరోగ్య సేవల అందుబాటు, తక్కువ ఖర్చును ప్రశంసించారు. ‘ప్రపంచమంతా తిరిగినా, జీవించడానికి భారత్నే ఎంచుకుంటాను’ అని ఒకరు వ్యాఖ్యానించగా, ‘మనకు సాధారణంగా అనిపించే ఈ సౌకర్యాలు నిజానికి ప్రత్యేకమైనవే’ అని మరొకరు పేర్కొన్నారు. మరో నెటిజన్ ‘ఆరోగ్య సేవలు, వైద్య సదుపాయాల విషయంలో భారత్కు సమానంగా మరే దేశం ఉండదు’ అంటూ స్పందించారు. భారత్లోని వైద్య సేవలను చూసి లిజ్ ఆశ్యర్యపోవడం ఇది మొదటిసారి కాదు. కొద్ది రోజుల క్రితం కూడా లిజ్ భారత్-అమెరికా వైద్య ఖర్చుల మధ్య ఉన్న భారీ తేడాపై మరో వీడియోను పంచుకుంది.
ఆ వీడియోలో అమెరికాలో రక్త క్యాన్సర్ చికిత్స కోసం ఉపయోగించే ‘రెవ్లిమిడ్’ (Revlimid) అనే బ్రాండెడ్ ఔషధం ఒక్క మాత్ర ధర సుమారు 1,000 డాలర్లు (దాదాపు రూ.85,000) ఉంటుందని పేర్కొంది. అదే ఔషధంలోని క్రియాశీల పదార్థం ‘లెనాలిడోమైడ్’ (Lenalidomide) కలిగిన జనరిక్ మాత్రలు భారత్లో రూ.35 నుంచి రూ.300 మధ్య లభిస్తున్నాయని వివరించింది. రెండు మందుల్లోనూ ఒకే క్రియాశీల పదార్థం ఉన్నప్పటికీ, ఒకటి బ్రాండెడ్ ఔషధం కాగా మరొకటి భారతీయ కంపెనీలు తయారు చేసే జనరిక్ మందు కావడం వల్లే ధరల్లో భారీ తేడా ఉంటుందని ఆమె వెల్లడించింది. లిజ్ అనుభవం ప్రస్తుతం భారతదేశంలో అందుబాటులో ఉన్న తక్కువ ఖర్చుతో కూడిన ఆరోగ్య సేవలు, వైద్య సదుపాయాలపై అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చర్చకు కారణమైంది.