Anand Mahindra: ఆ వ్యాఖ్యలకు ఇదే సమాధానం.. రిషి సునాక్ ఎన్నికపై ఆనంద్ మమహీంద్రా అదిరిపోయే ట్వీట్..

|

Oct 24, 2022 | 9:34 PM

బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించడంపై అనేక మంది భారత్ కు చెందిన ప్రముఖులతో పాటు.. ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు రిషి సునాక్ ను..

Anand Mahindra: ఆ వ్యాఖ్యలకు ఇదే సమాధానం.. రిషి సునాక్ ఎన్నికపై ఆనంద్ మమహీంద్రా అదిరిపోయే ట్వీట్..
Anand Mahindra
Follow us on

బ్రిటన్ కొత్త ప్రధానిగా మాజీ ఆర్థిక మంత్రి, కన్జర్వేటివ్ నేత రిషి సునాక్ ఎన్నికయ్యారు. ప్రధాని రేసులో ఉన్న పెన్నీ మోర్డాంట్ కు తగిన బలం లేకపోవడంతో తన నామినేషన్ ను ఆయన ఉపసంహరించుకోవడంతో రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా విజయం సాధించి చరిత్ర సృష్టించారు. ఓ భారత సంతతి వ్యక్తి తొలిసారిగా బ్రిటన్ ప్రధాని పగ్గాలు అధికారికంగా మరికొద్ది రోజుల్లో చేపట్టనున్నారు. బ్రిటన్‌ ప్రధానిగా భారత సంతతి వ్యక్తి రిషి సునాక్‌ ఏకగ్రీవంగా ఎన్నికై చరిత్ర సృష్టించడంపై అనేక మంది భారత్ కు చెందిన ప్రముఖులతో పాటు.. ప్రపంచ దేశాలకు చెందిన ప్రముఖులు రిషి సునాక్ ను అభినందిస్తున్నారు. బ్రిటన్‌ పాలనా పగ్గాలు అందుకున్న తొలి భారత సంతతి వ్యక్తిగా రిషి సునాక్ అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. దీంతో రిషి సునాక్ కు భారత్‌కు చెందిన ప్రముఖ వ్యాపార వేత్త ఆనంద్‌ మహీంద్రా కూడా అభినందనలు తెలియజేస్తూనే ఓ ఆసక్తికరమైన ట్వీట్ ను పోస్టు చేశారు. బ్రిటన్‌ మాజీ ప్రధాని విన్‌స్టన్‌ చర్చిల్‌ గతంలో భారత్‌పై చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. నేడు భారత వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నారో ఆనంద్ మహీంద్రా తన ట్వీట్ లో తెలిపారు.

1947 కాలంలో భారత నాయకులందరూ తక్కువ స్థాయిని కలిగి ఉంటారని, వారిలో తక్కువ శక్తిసామర్థ్యాలు ఉంటాయంటూ విన్‌స్టన్ చర్చిల్ అవహేళన చేశారు. కానీ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంలో భారతీయ సంతతికి చెందిన ఓ వ్యక్తి బ్రిటన్‌ పగ్గాలు చేపట్టడం ద్వారా వారికి తగిన జవాబు ఇచ్చారు. జీవితం ఎంతో అందమైంది అంటూ ట్వీట్‌ చేశారు ఆనంద్ మహీంద్ర. ఈ వ్యాపారవేత్త చేసిన ఈ పోస్ట్‌ వైరల్‌గా మారింది. ఇప్పటికే దీనిని వేలాది మంది లైక్‌ చేశారు. అనేకమంది కామెంట్లు చేస్తూ.. భారత్‌కు చెందిన అనేక మంది విదేశాల్లో ఉన్నత పదవుల్లో ఉన్న విషయాలను తమ కామెంట్లతో గుర్తు చేసుకుంటున్నారు.

ఇవి కూడా చదవండి

ఇటీవలే రిషి సునాక్ ప్రధానమంత్రి అవుతారని భావించారు. అయితే లిజ్ ట్రస్ కుఎక్కువ మంది మద్దతు పలకడంతో ఆమె బ్రిటన్ ప్రధాని అయ్యారు. ఎన్నికల్లో గెలిచి బ్రిటన్ ప్రధాని పదవి చేపట్టిన లిజ్ ట్రస్ కేవలం 45 రోజులకే రాజీనామా చేశారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలం కావడంతో ట్రస్ పై ప్రజలతో పాటు సొంత పార్టీ నేతల్లోనూ అసంతృప్తి నెలకొంది. వరుసగా తన కేబినెట్ లోని మంత్రులు రాజీనామాలు చేయడంతో గత్యంతరం లేక లిజ్ ట్రస్ ప్రధాని పదవికి రాజీనామా చేశారు. దీంతో బ్రిటన్ లో మరోసారి ప్రధాని పదవికి ఎన్నికలు అనివార్యంగా మారాయి. అయితే పోటీలో నిలిచేందుకు మద్దతు కూడగట్టడంలో పెన్నీ మోర్డాంట్ విఫలం కావడంతో ఆ రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని అయ్యేందుకు మార్గం సుగమమైంది.

మరిన్ని  జాతీయ వార్తల కోసం చూడండి..