Vice President: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ సింగ్..? పార్టీ విలినం తర్వాతే ప్రకటన

|

Jul 02, 2022 | 5:18 PM

భారతదేశ తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరఫున పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ నిలబడనున్నట్లు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే...

Vice President: ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా అమరీందర్ సింగ్..? పార్టీ విలినం తర్వాతే ప్రకటన
Amarinder Singh
Follow us on

భారతదేశ (India) తదుపరి ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరఫున పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (Captain Amarinder Singh) నిలబడనున్నట్లు తెలుస్తోంది. ఉప రాష్ట్రపతి పదవికి ఎన్డీయే అభ్యర్థిగా అమరీందర్‌ను నిలబెట్టే అవకాశముందని అమరీందర్ సింగ్ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా.. కెప్టెన్ అమరీందర్ సింగ్ తన పార్టీని బీజేపీలో కలిపేస్తున్నారన్న ఊహాగానాల నేపథ్యంలో ఈ ప్రకటన రావడం చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అమరీందర్‌ సింగ్‌ శస్త్రచికిత్స కోసం లండన్‌ వెళ్లారు. గత ఆదివారం సర్జరీ పూర్తయింది. ఆపరేషన్ అయిన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ (PM Modi) అమరీందర్ సింగ్ తో మాట్లాడారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. లండన్‌ నుంచి తిరిగివచ్చిన తర్వాత కెప్టెన్‌ తన పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌ (పీఎల్‌సీ)’ పార్టీని బీజేపీలోకి విలీనం చేస్తారని కథనాలు వచ్చాయి. పార్టీని బీజేపీలోకి కలిపేసిన తర్వాత కెప్టెన్‌ను ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించే అవకాశముంది.

ఐదు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌లో పనిచేసిన అమరీందర్‌. గతేడాది ఆ పార్టీ నుంచి వైదొలిగారు. అప్పటి పంజాబ్‌ పీసీసీ చీఫ్‌ నవజ్యోత్‌ సింగ్‌తో విభేదాలు రావడంతో ఆయనను సీఎం పదవి నుంచి కాంగ్రెస్‌ తప్పించింది. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అమరీందర్ సింగ్.. కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కొత్త పార్టీని ప్రారంభించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేశారు. అయినా ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయారు. పటియాలా నుంచి పోటీ చేసిన అమరీందర్ సింగ్‌ కూడా ఓడిపోయారు.

కాగా.. ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము బరిలో ఉన్నారు. విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాను నిలిపితే NDA తన అభ్యర్థిగా ముర్మును తెరపైకి తెచ్చారు. అంతకుముందు, రాష్ట్రపతి అభ్యర్థి పేరుపై మేధోమథనం చేయడానికి బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతర పార్లమెంటరీ బోర్డు సభ్యులు పాల్గొన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.