
ఖరీఫ్ సీజన్లో రైతులు కలబందను సాగు చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కలబందను రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా పెద్ద ఎత్తున ఉత్పత్తి చేస్తున్నారు. కలబందను నాటడానికి జులై నుంచి ఆగస్టు మంచి సమయం. ఈ సీజన్లో కలబంద మొక్కలు నాటడం ద్వారా మంచి ఉత్పత్తి వస్తుంది. హెక్టారుకు సగటున 30-35 టన్నుల తాజా ఆకులు ఉత్పత్తి అవుతాయి. తద్వారా ఒక ఎకరానికి సులభంగా రూ .2 లక్షల వరకు సంపాదించవచ్చని రైతులు అంటున్నారు.

బ్రాహ్మి.. ఇది ఔషధ గుణాలు కలిగిన మొక్క. అన్ని రకాల మందులు దీని నుండి తయారవుతాయి. దీని ఆకులు మలబద్దకం నుండి ఉపశమనానికి సహాయపడతాయని అంటారు. అదే సమయంలో, దాని రసం ఆర్థరైటిస్ చికిత్సలో ఉపయోగిస్తారు. బ్రహ్మికి రక్త శుద్దీకరణ లక్షణాలు కూడా ఉన్నాయి. ఇది మనస్సును చురుకుగా ఉంచుతుంది. జ్ఞాపకశక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. వ్యవసాయ నిపుణులు ఈ బ్రహ్మి సాగుకు అనువైన సమయం వర్షాకాలం అని చెబుతున్నారు. దీని సాగు ఖర్చు ఒక శాతం అయితే, ఉత్పత్తి తరువాత నాలుగు రెట్ల సంపాదన లభిస్తుందంటున్నారు.

భారతదేశ మైదాన ప్రాంతాలలో పొదలు రూపంలో కౌంచ్ పెరుగుతుంది. విత్తనాల ద్వారా పంట వేస్తారు. వర్షానికి ముందు వీటిని విత్తడం ద్వారా ప్రయోజనం ఉంటుంది. కౌంచ్ పంటకు అనుకూల సమయం జూన్ 15 నుండి జూలై 15 వరకు ఉంటుంది. విత్తనాలు వేయడానికి ఎకరానికి 6 నుండి 8 కిలోల చొప్పున విత్తనాలు అవసరం అవుతాయి. దీని సాగు ద్వారా ఎకరాకు రూ. 3 లక్షలకు సులభంగా ఆర్జించవచ్చు.

భారతదేశం, శ్రీలంక, హిమాలయ ప్రాంతంలో సత్వర్ కనిపిస్తుంది. సత్వర్లో చాలా రకాలు ఉన్నాయి. ఇది పొద మాదిరిగా ఒకటి నుండి రెండు మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. సత్వర్ సాగుకు జులై నెల ఎంతో అనువైనది. ఒక ఎకరాలో సత్వర్ పండిస్తే దాదాపు రూ. 5 నుంచి 6 లక్షల వరకు ఆదాయం వస్తుందంటున్నారు.

లెమన్గ్రాస్ ఇది బహుముఖ ఔషధ గుణాలు కలిగిన మొక్క. దీని సాగుకు అనువైన సమయం ఫిబ్రవరి నుంచి జులై. దీని సాగులో ప్రత్యేకత ఏంటంటే.. ఒకసారి ఈ పంటను నాటితే నాలుగైదు సంవత్సరాల పాటు దిగుబడిని పొందవచ్చు. ఎకరా లెమన్ గ్రాస్ పంటకు రూ. 30 నుంచి 40 వేల ఖర్చు అయితే.. సంపాదన మాత్రం రూ. 2 నుంచి రూ. 3 లక్షల వరకు వస్తుంది. సాంప్రదాయ పంటలకు బదులుగా ఈ పంటలను సాగు చేయడం ద్వారా అధిక రాబడిని పొందవచ్చు.