రైతుల నిరసనలో కొత్త మలుపు, ఢిల్లీ-హర్యానా సరిహద్దుల్లో ఇళ్ళు కడుతున్న అన్నదాతలు
వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ మూడు నెలలకుపైగా ఆందోళన చేస్తున్నరైతులు కొత్త బాట పట్టారు. ఢిల్లీ-హర్యానా సమీపంలోని తిక్రి బోర్డర్ లో వీరు సొంతంగా ఇళ్ళు నిర్మించేస్తున్నారు.
వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ మూడు నెలలకుపైగా ఆందోళన చేస్తున్నరైతులు కొత్త బాట పట్టారు. ఢిల్లీ-హర్యానా సమీపంలోని తిక్రి బోర్డర్ లో వీరు సొంతంగా ఇళ్ళు నిర్మించేస్తున్నారు. ఇటుకలు, సిమెంట్ తదితరాలతో ఇక్కడ ఇళ్ల నిర్మాణం ప్రారంభమైంది. నిర్మాణ సామాగ్రికి వీరు చార్జీలు చెల్లిస్తున్నా.. లేబర్ కార్మికులకు మాత్రం ఏ విధమైన చెల్లింపులూ జరపడంలేదు. ఒక్కో ఇంటి నిర్మాణానికి 20 వేల నుంచి 25 వేల రూపాయల వరకు ఖర్చవుతోందని అంచనా. అంటే అతి చౌకగా వీటి నిర్మాణం సాగుతోంది. చాలామంది రైతులు తమ ట్రాక్టర్లను తాత్కాలిక షెల్టర్లుగా మార్చేశారు. పంట కోతల కాలం గనుక పలువురు తమ ట్రాక్టర్లను గ్రామాలకు పంపివేశారు. అయితే ఇదే సమయంలో మరికొంతమంది ఇళ్ల నిర్మాణం కోసం ఇటుకలు మొదలైవాటిని తరలించేందుకు వీటిని వాడుతున్నారు. తమ ఈ నిర్మాణాలను సింఘు బోర్డర్ వరకు విస్తరించే అవకాశాలు ఉన్నాయని రైతు నేతలు చెబుతున్నారు. గత జనవరి 26 రిపబ్లిక్ దినోత్సవం నాడు ఎర్రకోట వద్ద జరిగిన ఘర్షణల్లో తమ అన్నదాతల్లో చాలామంది మీద తప్పుడు కేసులు పెట్టి పోలీసులు అరెస్టు చేశారని వీరు ఆరోపిస్తున్నారు. ఇంకా అరెస్టులు జరుగుతున్నాయన్నారు.
ఇలా ఉండగా కేంద్రానికి, రైతు నేతలకు మధ్య 11 దఫాలుగా చర్చలు జరిగినప్పటికీ ఇవి ఇప్పటివరకు ఎలాంటి ఫలితాలను ఇవ్వలేకపోయాయి. తమ సూచనలను రైతు సంఘాలు పట్టించుకోవడంలేదని, చట్టాల సవరణకు తాము అంగీకరించినా వారు తిరస్కరిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ వ్యాఖ్యానిస్తున్నారు. చర్చలు విఫలం కావడానికి వారే కారణమని అంటున్నారు కాగా తమఆందోళన ఆగదని, అక్టోబర్ 2 వరకు, ఆ తరువాత కూడా కొనసాగుతుందని తికాయత్ వంటి నేతలు పేర్కొంటున్నారు. తాము రోజుకోరకంగా నిరసన తెలుపుతామని ఆయన ఇదివరకే ప్రకటించారు. ఈ నేపథ్యంలో హర్యానా బోర్డర్ లో వీరు ఇళ్ల నిర్మాణానికి దిగడం వినూత్న విశేషం.
మరిన్ని ఇక్కడ చదవండి:
భాగ్యనగర శివారులో దారుణం.. కత్తులతో దాడి చేసి రౌడీషీటర్ హత్య.. దర్యాప్తు చేపట్టిన పోలీసులు