
తమిళనాడులో ఎన్నికల సిత్రాలు జిగేల్మంటున్నాయి. ఓటుకు నోటు ప్రలోభాల యవ్వారాలకు తెరలేచింది. ఈసీ ఆదేశాలతో రాష్ట్ర వ్యాప్తంగా నిఘా పెంచారు పోలీసులు. ఫ్లయింగ్ స్క్వాడ్స్ రంగంలోకి దిగాయి.అంతే టచ్ చేస్తే చాలు తనిఖీల్లో నగలు, నగదు , నట్రా ..గట్రా జోరుగా పట్టుబడుతున్నాయి. విరుదునగర్లో , వజ్రం, ప్లాటినం , బంగారు నగలు, వెండి వస్తువులను సీజ్ చేశారు. వీటి విలువ 14 కోట్ల పైమాటే. వీటిని ఎవరు..ఎందుకు..ఎక్కడికి తరలిస్తున్నారనే లెక్కా పత్రాల్లేవ్.. సూళక్కరై ప్రాంతంలోని హోలీ క్రాస్ ఆసుపత్రి తనిఖీల్లో ఈ సరుకు పట్టుబడింది. పట్టుబడిన వారిని ఆరా తీస్తే మలబార్ గోల్డ్ కంపెనీ నుంచి నాగర్కోయిల్లోని వివిధ నగల దుకాణాలకు సరఫరా చేయడానికి నగలను తీసుకెళ్తున్నామని చెప్పారట. కానీ అందుకు సంబంధించిన సరైన పత్రాలు చూపించలేకపోయారు.
దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వాహనాన్ని విరుదునగర్ రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయానికి తీసుకెళ్లి విచారణ చేపట్టారు.
ఇక నామక్కల్ జిల్లా పల్లిపాళయంలో డీఎంకే నాయకుడు తంగమణి గోదాములో భారీగా స్టాక్ చేసిన చీరలను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. శ్రీటెక్స్ టైల్ పేరిట ఇక్కడి నుంచి ఆర్డర్ల ఆధారంగా చీరలు, ధోతీలు, షర్ట్లు ఆన్లైన్ ద్వారా బట్వాడా చేస్తుంటారు. ఐతే తంగమణి తన దుకాణంలో ఓటర్లకు పంపిణీ చేయడానికి వేల సంఖ్యలో చీరలు నిల్వ ఉంచినట్లు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులకు సమాచారం అందింది. వెంటనే స్పాట్కు వెళ్లిన అధికారులు 6లక్షల విలువ చేసే చీరల స్టాక్ను స్వాధీనం చేసుకున్నారు. .
ఐతే తనిఖీలకు వెళ్లిన ఫ్లయింగ్ స్వ్కాడ్ అధికారులతో సదరు నేత అనుచరులు వాగ్వాదానికి దిగారు. ఇవి ఎన్నికల్లో పంచడం కోసం కాదని, తమ రెగ్యూలర్ బిజినెస్ అని ..ఎలా సీజ్ చేస్తారంటూ ప్రశ్నించారు. స్టాక్ను తహశీల్దార్ ఆఫీసుకు తరలించారు అధికారులు. సరైన ఆధారాలు చూపితే స్టాక్ను తీసుకెళ్లొచ్చని చెప్పారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి..