Bharat Bandh: ఉత్తరాదిపైనే కనిపించిన భారత్ బంద్ ప్రభావం.. కేవలం ప్రధాన పట్టణాల్లోనే ఎఫెక్ట్..
అగ్రి చట్టాల వ్యతిరేక నినాదాలతో దేశం దద్దరిల్లింది. దిల్లీ నుంచి గల్లి వరకు జైకిసాన్ నినాదం మారుమోగింది. అన్ని పక్షాలు సంపూర్ణ మద్దతుతో భారత్ బంద్ ప్రశాంతంగా సాగింది. ఈ ఎఫెక్ట్ తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా కనిపించలేదు. అక్కడక్కడ చిన్న ఘర్షణలు జరిగాయి.
వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా చేపట్టిన భారత్ బంద్ ప్రభావం ఉత్తరాదిలోనే ఎక్కువగా కనిపించింది. ఉదయం నుంచే రోడ్లపై బైఠాయించిన అన్నదాతలు..వాహనాల రాకపోకలు అడ్డుకున్నారు. నవంబర్ 26 నుంచి పోరాటం చేస్తున్న రైతులు… శుక్రవారం భారత్బంద్ పిలుపునిచ్చారు. బంద్కు ఎన్డీఏ పక్షాలు మినహా అన్ని పార్టీలు సపోర్ట్ చేశాయి. సాధారణ జనజీవనంపై బంద్ ప్రభావం పడింది. కొన్ని ప్లేసెస్లో వినూత్న రీతిలో ప్రదర్శనలు చేశారు రైతులు. పాటలు పాడుతూ, నృత్యాలు చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా నినదించారు. బంద్ కారణంగా కొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడిచాయి.
బీజేపీ, జనసేన మినహా అన్ని పక్షాలు మద్దతతో ఆంధ్రప్రదేశ్లోనూ బంద్ ఎఫెక్ట్ కనిపించింది. నేతల ర్యాలీలతో వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు నిరసనకారులు. అగ్రి చట్టాలతోపాటు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపైనా మండిపడ్డారు. రెండు నిర్ణయాలు వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేశారు ఆందోళనకారులు.
ఏపీ ప్రభుత్వం మద్దతుతో బస్సులన్ని డిపోలకే పరిమితమయ్యాయి. బస్టాండ్లు వెలవెలబోయాయి. భీమవరంలో ఓ కాలేజీ బస్సులను SFIనాయకులు ధ్వంసం చేశారు. క్లాసులు నిర్వహిస్తున్నారని ఆగ్రహంతో అద్దాలు పగలు గొట్టారు. చాలా ప్రాంతాల్లో విద్యాసంస్థలు, వ్యాపార వాణిజ్య సంస్థలు మూసివేశారు. భారత్ బంద్లో స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. కూర్మన్నపాలెం జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
తెలంగాణలో భారత్ బంద్ ప్రభావం స్వల్పంగా కనిపించింది. హైదరాబాద్లో బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి నారాయణగూడ వైఎంసీఏ వరకు వామపక్షాలు ర్యాలీ చేపట్టాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభద్రం ఇందులో పాల్గొన్నారు. బంద్తో జాతీయ రహదారులు నిర్మానుష్యమైంది. కొన్ని చోట్ల ఆర్టీసీ బస్సుల్లేక ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. ఇండస్ట్రీలు యథావిధిగా నడిచాయి.