‘కుటుంబ మోహాన్ని విడనాడండి’, సోనియాకు మరో లేఖ

| Edited By: Pardhasaradhi Peri

Sep 07, 2020 | 9:47 AM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరో లేఖ 'ఉసురు' తగిలింది. కుటుంబ మోహాన్ని విడనాడాలని, పరస్పర విశ్వాసం, రాజ్యాంగ బధ్ధ, ప్రజాస్వామ్య విలువలతో పార్టీకి మళ్ళీ జవసత్వాలు తేవాలని కోరుతూ..

కుటుంబ మోహాన్ని విడనాడండి, సోనియాకు మరో లేఖ
Follow us on

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి మరో లేఖ ‘ఉసురు’ తగిలింది. కుటుంబ మోహాన్ని విడనాడాలని, పరస్పర విశ్వాసం, రాజ్యాంగ బధ్ధ, ప్రజాస్వామ్య విలువలతో పార్టీకి మళ్ళీ జవసత్వాలు తేవాలని కోరుతూ యూపీకి చెందిన 9 మంది మాజీ పార్టీ నేతలు ఆమెకు లేఖ రాశారు. ఇలాంటి లేఖనే 23 మంది సీనియర్ నాయకులు లేఖ రాయడం, దానిపై కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలో పెద్ద రచ్చ జరగడం తెలిసిందే. పూర్తి స్థాయి, సమిష్టి నాయకత్వం, పార్టీలో ప్రతి స్థాయిలో  ఎన్నికల నిర్వహణ వంటి ‘వివాదాస్పదమైన’ అంశాలను వారు తమ లేఖలో ప్రస్తావించారు. ఇప్పటి తాజా లేఖ కూడా దాదాపు దానికి బ్లూ ప్రింట్ మాదిరే ఉంది. కుటుంబ వ్యామోహం నుంచి బయటపడాలని, గత రెండు సార్వత్రిక ఎన్నికల్లోనూ పార్టీ ఎందుకు ఓడిపోయిందో సమీక్షించుకుని ఇప్పటికైనా ఈ చారిత్రాత్మక సంస్థను బలోపేతమైనదిగా తీర్చిదిద్దాలని ఈ చోటామోటా నాయకులు సోనియాను కోరారు.

చేవలుడిగిన పార్టీని మళ్ళీగాడిలో పెట్టాలని వారు అభ్యర్థించారు. పార్టీ ప్రతిష్టను దిగజార్చారని, పార్టీ నిర్ణయాలను బాహాటంగా వ్యతిరేకించారన్న ఆరోపణలపై గత ఏడాది నవంబరులో వీరిని బహిష్కరించారు. . మాజీ ఎంపీ సంతోష్ సింగ్, మాజీ మంత్రి సత్యదేవ్ త్రిపాఠీ వంటివారు ఈ లేఖపై సంతకాలు పెట్టిన తొమ్మిది మందిలో ఉన్నారు. ఇక ఈ లెటర్ కూడా తిరిగి ఎలాంటి సంక్షోభాన్ని రేపుతుందో  చూడాలి.

 

,