ఉత్తర ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందారు. బోలెరే వాహనం బస్సును ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. మీర్జాపూర్ – ప్రయోగరాజ్ హైవేపై మహా కుంభమేళాకు భక్తులతో వెళ్తున్న బొలెరో కారు.. ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది మృతి చెందగా.. మరో 19 మందికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా ఛత్తీస్గఢ్కు చెందినవారిగా గుర్తించారు. ప్రయాగ్రాజ్లో జరిగే కుంభమేళకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. డ్రైవర్ నిద్రమత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
మేజా పోలీస్ స్టేషన్ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. మహా కుంభమేళాలో పుణ్యస్నానాలు ఆచరించేందుకు ఒక బొలెరో వాహనం ఛత్తీస్గఢ్ నుంచి ప్రయాగ్రాజ్కు వెళుతోంది. బస్సు మహా కుంభమేళా నుంచి వారణాసికి తిరిగి వెళుతోంది. సరిగ్గా అర్ధరాత్రి రెండు గంటల ప్రాంతంలో మీర్జాపూర్ – ప్రయోగరాజ్ హైవేపై మేజా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని మను కే పురా గ్రామం సమీపంలో కారు ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిందని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వివేక్ చంద్ర యాదవ్ తెలిపారు. ఈ ప్రమాదంలో వాహనాలు నుజ్జునుజ్జయ్యాయి..
ఈ ప్రమాదం తర్వాత, సంఘటనా స్థలంలో అరుపులు, కేకలు మిన్నంటాయి. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతులను, క్షతగాత్రులను బయటకు తీసేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతులు ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాకు చెందిన వారని పోలీసులు తెలిపారు.
ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 19 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వారిని చికిత్స కోసం రామ్నగర్లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్కు తరలించారు. బస్సులో ప్రయాణిస్తున్న భక్తులు మధ్యప్రదేశ్లోని రాజ్గఢ్ జిల్లా నివాసితులు. వారు మహా కుంభమేళా నుండి వారణాసికి వెళ్తున్నారు.. ఈ సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..