
స్మార్ట్ఫోన్ ఇప్పుడు మనిషి శరీరంలో ఒక భాగమైపోయింది. తినేటప్పుడు, పడుకునేటప్పుడు.. ఆఖరికి టాయిలెట్కు వెళ్లేటప్పుడు కూడా ఫోన్ను వదలడం లేదు. రీల్స్ చూడటం, సోషల్ మీడియాలో చాటింగ్ చేయడం వంటి అలవాట్లతో అవసరమైన దానికంటే ఎక్కువ సమయం టాయిలెట్ సీటుపై గడిపేస్తున్నారు. అయితే ఈ చిన్న సరదా మీ ప్రాణాల మీదకు తెస్తుందని, ముఖ్యంగా పైల్స్ వంటి భయంకరమైన వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా టాయిలెట్ సీటుపై కూర్చున్నప్పుడు పురీషనాళంపై సహజంగానే ఒత్తిడి ఉంటుంది. ఫోన్ చూస్తూ గంటల తరబడి అక్కడే కూర్చోవడం వల్ల ఈ ఒత్తిడి రెట్టింపు అవుతుంది. దీనివల్ల రక్తనాళాలు ఉబ్బి, తీవ్రమైన మలబద్ధకం, మూలవ్యాధి వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని పరిశోధనల్లో తేలింది.
శరీరం నుండి వ్యర్థాలను బయటకు పంపే ప్రక్రియలో మెదడు కీలక పాత్ర పోషిస్తుంది. మెదడు సిగ్నల్స్ ఇచ్చినప్పుడు మాత్రమే అవయవాలు స్పందిస్తాయి. కానీ మీరు ఫోన్లో నిమగ్నమైనప్పుడు మెదడు డైవర్ట్ అవుతుంది. ఫలితంగా కడుపు పూర్తిగా శుభ్రపడదు. లోపల మిగిలిపోయిన మురికి కాలక్రమేణా విషతుల్యమై ఇతర తీవ్ర అనారోగ్యాలకు కారణమవుతుంది.
టాయిలెట్లో ఫోన్ చూసేటప్పుడు మనం వంగి కూర్చుంటాం. ఈ భంగిమ మెడ, భుజాలపై భరించలేని ఒత్తిడిని కలిగిస్తుంది. నిరంతరం కిందకు చూస్తూ ఉండటం వల్ల మెడ ఎముకలు అరిగిపోవడం, తీవ్రమైన తలనొప్పి, వెన్నుపాము సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. ఇప్పటికే వెన్నునొప్పి ఉన్నవారు ఈ అలవాటుకు దూరంగా ఉండటం శ్రేయస్కరం.
టాయిలెట్లో ఉండే ప్రమాదకరమైన ఈ-కోలి వంటి బ్యాక్టీరియాలు మీ ఫోన్ స్క్రీన్పైకి సులభంగా చేరుతాయి. మీరు చేతులు కడుక్కున్నా, ఫోన్ ద్వారా ఆ బ్యాక్టీరియా మళ్లీ మీ శరీరంలోకి ప్రవేశిస్తుంది. ఇది తీవ్రమైన జీర్ణకోశ వ్యాధులకు, చర్మ సంబంధిత ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది.