Pet Health: పెంపుడు జంతువులకూ డయాబెటిస్ వస్తుందట.. ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ అవ్వాల్సిందే
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధరాణ అయితే తినే ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదం ముంగిట్లోనే ఉంటుంది. కానీ డయాబెటిస్ మనుషులకే కాదు..పెంపుడు జంతువుకు కూడా వస్తుందని మీకు తెలుసా? అవును.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మనుషుల మాదిరిగానే, కుక్కలు, పిల్లులు వంటి..
నేటి కాలంలో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిస్తో బాధపడుతున్నారు. ఒక్కసారి డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధరాణ అయితే తినే ఆహారంపై అధిక శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేదంటే ప్రమాదం ముంగిట్లోనే ఉంటుంది. కానీ డయాబెటిస్ మనుషులకే కాదు..పెంపుడు జంతువుకు కూడా వస్తుందని మీకు తెలుసా? అవును.. వినడానికి ఆశ్చర్యంగా అనిపించినా ఇది నిజం. మనుషుల మాదిరిగానే, కుక్కలు, పిల్లులు వంటి పెంపుడు జంతువులకు కూడా మధుమేహం రావచ్చు. కానీ పెంపుడు జంతువుకు డయాబెటిస్ ఉందో లేదో తెలుసుకోవడంలో చాలా మంది విఫలమవుతుంటారు. అయితే ఈ కింది లక్షణాలను బట్టి ఈ పెట్ డాగ్ లేదా పిల్లికి డయాబెటిస్ ఉందో లేదో కనిపెట్టేయొచ్చు. అవేంటంటే..
పెంపుడు జంతువు తరచుగా నీరు తాగటం, తరచుగా మూత్రవిసర్జన చేయడం, నిద్ర మత్తుగా ఉన్నట్లుగా కనిపిస్తే.. వెంటనే జాగ్రత్తగా ఉండాలి. పెట్ డాగ్ అనారోగ్యంతో ఉందని అర్ధం చేసుకోవాలి. అలాగే మధుమేహం ఉన్న పెంపుడు జంతువులు అకస్మాత్తుగా బరువు తగ్గతాయి. బలహీనత, అన్ని వేళలా వణుకు, ఆకలి లేకపోవడం, తినడానికి ఇష్టపడకపోవడం వంటి ఇతర శారీరక సమస్యలు కనిపిస్తాయి. కాబట్టి, ఈ లక్షణాలన్నీ కనిపిస్తే సమయం వృథా చేయకుండా ముందుగా వైద్యుడిని సంప్రదించడం మర్చిపోకూడదు. వైద్యులు సిఫార్సు చేసిన విధంగా మీ పెంపుడు జంతువు తినే ఆహారాన్ని మార్చాలి. దీనితోపాటు పెంపుడు జంతువు మధుమేహంతో బాధపడుతుంటే ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి.
బరువు
పెట్ డాగ్కు మధుమేహం ఉంటే మొదట చేయవలసినది బరువు చెక్ చేయాలి. నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి 2 నుండి 3 వారాలకు కొన్ని సాధారణ చెకప్లను చేయించడం చాలా ముఖ్యం. ఇవి రక్తంలో చక్కెర పెరుగుతుందో లేదో అది తెలియజేస్తాయి. అంతేకాకుండా బరువును క్రమం తప్పకుండా చెక్ చేయాలి. మధుమేహం ఉంటే అధికంగా బరువు పెరగడం లేదంటే తగ్గడం వంటి సంకేతం కనిపిస్తుంది.
నిర్దిష్ట సమయాల్లో తినడం
పెట్ యానిమల్స్కు డయాబెటిస్ ఉన్నట్లు నిర్ధారణ అయినట్లయితే, వాటికి ఇచ్చే ఆహారం మార్చాలి. పెంపుడు జంతువుల జాతి, బరువును బట్టి అవి ఆహారం తీసుకుంటాయి. అయితే, రక్తంలో చక్కెర స్థాయి చాలా ఎక్కువగా ఉంటే 12 గంటల వ్యవధిలో రోజుకు రెండుసార్లు ఆహారం ఇవ్వడం అవసరం. ప్రతి భోజనం తర్వాత ఇన్సులిన్ క్రమం తప్పకుండా ఇవ్వాలి. ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరం ఉందా లేదా ఎన్ని మోతాదులు ఇవ్వాలో డాక్టర్ సలహా మీద పాటించాలి.
రెగ్యులర్ డైట్
ఈ సమయంలో ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే బరువును అదుపులో ఉంచుకోవడం కూడా ముఖ్యం. క్యారెట్, బ్రోకలీ వంటి అధిక ఫైబర్, తక్కువ కొవ్వు పదార్ధాలను ఆహారంలో ఇవ్వాలి. ఎలాంటి ప్రాసెస్డ్ ఫుడ్ లేదా ప్యాకెట్ ఫుడ్ ఇవ్వకపోవడమే మంచిది. తీపి ఆహారం అస్సలు ఇవ్వకూడదు. నీరు క్రమం తప్పకుండా ఇవ్వాలి.
వ్యాయామం
మనుషుల మాదిరిగానే, పెంపుడు జంతువులను ఆరోగ్యంగా ఉంచడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయించాలి. పెంపుడు జంతువును ప్రతిరోజూ ఆరుబయట ఆడుకోవడానికి తీసుకెళ్లాలి.