
ఇల్లు కట్టుకునేటప్పుడు హాలు, బెడ్రూమ్ ఇచ్చే ప్రాధాన్యత మరుగుదొడ్డికి ఇవ్వడం చాలా తక్కువ. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంటి పురోగతికి మరుగుదొడ్డి నిర్మాణం, దాని దిశ అత్యంత కీలకం. తప్పుడు దిశలో మరుగుదొడ్డి ఉండటం వల్ల ఇంట్లో ప్రతికూల శక్తి పెరిగి, లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గుతుందని పండితులు చెబుతున్నారు. వాస్తు ప్రకారం.. ఈశాన్య మూల దేవతల నివాసంగా, పరమ పవిత్రమైనదిగా చెబుతారు. ఈ దిశలో మరుగుదొడ్డి లేదా స్నానాల గదిని నిర్మించడం వల్ల తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి. కుటుంబ సభ్యులు తరచూ అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని వాస్తు శాస్త్రం చెబుతోంది.
చాలామంది బాత్రూమ్ తలుపుల ముందు అద్దాలను ఏర్పాటు చేసుకుంటారు. కానీ ఇది వాస్తు విరుద్ధం. మరుగుదొడ్డి తలుపు ముందు అద్దం పెట్టడం వల్ల దానిలోని ప్రతికూల శక్తి రెట్టింపు అయి ఇంటి నిండా వ్యాపిస్తుంది. మరుగుదొడ్డి తలుపులను ఎప్పుడూ మూసి ఉంచడం శ్రేయస్కరం. తలుపులు తెరిచి ఉంచడం వల్ల అక్కడ ఉండే నెగటివ్ ఎనర్జీ ఇంట్లోని ఇతర భాగాలకు సోకుతుంది.
ప్రస్తుతం అటాచ్డ్ బాత్రూమ్ల ట్రెండ్ నడుస్తోంది. అయితే వీటిలో గాలి బయటకు పోవడానికి ఖచ్చితంగా కిటికీ ఉండాలి. వాస్తు ప్రకారం బాత్రూమ్ కిటికీలు ఉత్తరం, తూర్పు లేదా పడమర వైపు ఉండటం శుభప్రదం. ఇది ప్రతికూల శక్తిని బయటకు పంపి, సానుకూలతను పెంచుతుంది.
మరుగుదొడ్డిని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఇంట్లో అంత ప్రశాంతత ఉంటుంది. వాస్తు ప్రకారం స్నానాల గదిలో నీలం రంగు వాడటం చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇది ప్రశాంతతను ఇచ్చి శ్రేయస్సుకు దోహదపడుతుంది. వారానికి ఒకసారి ఉప్పుతో బాత్రూమ్ను శుభ్రం చేయడం వల్ల నెగటివ్ ఎనర్జీ తొలగిపోతుందని పెద్దలు చెబుతుంటారు. మరుగుదొడ్డి కేవలం ఒక అవసరమే కాదు, అది ఇంటి శక్తి కేంద్రాలలో ఒకటి. ఈ మార్పులు చేసుకోవడం ద్వారా ఆర్థిక వృద్ధిని, కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.
(Disclaimer: ఈ వార్తలోని సమాచారం మత సంబంధమైన అంశాలపై ఆధారపడి ఉన్నాయి. పాఠకుల ఆసక్తి మేరకు అందించడం జరిగింది. దీనిని సంస్థ ధృవీకరించదు.)