Hair Care: షాంపూ వాడకుండా కేవలం నీటితోనే తలస్నానం చేస్తే.. లాభమా లేక నష్టమా?

ప్రస్తుత కాలంలో రసాయనాలు లేని సహజసిద్ధమైన జీవనశైలిపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ఈ క్రమంలోనే షాంపూలను పూర్తిగా పక్కన పెట్టి, కేవలం నీటితో మాత్రమే తలస్నానం చేసే 'నో-పూ' (No-Poo) విధానం అంతర్జాతీయంగా ఒక కొత్త ట్రెండ్‌గా మారింది. షాంపూలలో ఉండే సల్ఫేట్లు, పారాబెన్లు వంటి కఠినమైన రసాయనాల నుండి జుట్టును రక్షించుకోవడానికి ఈ పద్ధతి ఉపయోగపడుతుందని కొందరు భావిస్తున్నారు. అయితే రసాయనాలు లేని ఈ విధానం వల్ల కొన్ని ప్రయోజనాలు ఉన్నప్పటికీ, కేవలం నీటితో మాత్రమే తలస్నానం చేయడం వల్ల జుట్టుకు కొన్ని తీవ్రమైన నష్టాలు కూడా వాటిల్లుతాయని హెయిర్ కేర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Hair Care: షాంపూ వాడకుండా కేవలం నీటితోనే తలస్నానం చేస్తే..  లాభమా లేక నష్టమా?
Hair Wash With Only Water

Updated on: Jun 19, 2026 | 9:22 PM

అందమైన, ఆరోగ్యకరమైన జుట్టును కలిగి ఉండాలని ప్రతి ఒక్కరూ ఆరాటపడుతుంటారు. అయితే నిత్యం మార్కెట్లో దొరికే రకరకాల రసాయన షాంపూలను వాడటం వల్ల జుట్టు రాలడం, పొడిబారడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ‘నో-పూ’ ట్రెండ్ బాగా ప్రాచుర్యం పొందింది. ఈ పద్ధతిని పాటించేవారు షాంపూలను అస్సలు ముట్టకుండా కేవలం సాధారణ నీటితోనే జుట్టును శుభ్రం చేసుకుంటారు, లేదా అవసరమైతే బేకింగ్ సోడా, ఆపిల్ సైడర్ వెనిగర్ వంటి సహజ ఉత్పత్తులను మాత్రమే ఉపయోగిస్తారు.అంతర్జాతీయ ఆరోగ్య పరిశోధన సంస్థల నివేదికల ప్రకారం, ఈ విధానం వల్ల జుట్టుకు ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

కేవలం నీటితో కడగడం వల్ల కలిగే ప్రయోజనాలు
ఈ పద్ధతిని అనుసరించడం వల్ల జుట్టుకు కొన్ని స్పష్టమైన ప్రయోజనాలు చేకూరుతాయి. రోజూ లేదా తరచూ షాంపూలను ఉపయోగించడం వల్ల జుట్టులోని సహజమైన నూనెలు పూర్తిగా నశించి కుదుళ్లు పొడిబారిపోతాయి. అలా కాకుండా కేవలం నీటితో తలస్నానం చేసినప్పుడు జుట్టులోని సహజ తేమ (మాయిశ్చర్) దెబ్బతినకుండా ఉంటుంది. ఇది షాంపూలలో ఉండే ప్రమాదకరమైన కెమికల్స్ నుండి జుట్టును రక్షించడమే కాకుండా, ప్లాస్టిక్ బాటిళ్ల వాడకాన్ని తగ్గించి పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.

నిపుణులు హెచ్చరిస్తున్న నష్టాలు
ఈ పద్ధతి వినడానికి బాగానే ఉన్నప్పటికీ దీనికి మరో కోణం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. సైన్స్ ప్రకారం నూనె, నీరు ఎప్పటికీ ఒకదానితో ఒకటి కలవవు. మన తల చర్మం (స్కాల్ప్) సహజంగా ‘సెబమ్’ అనే నూనెను ఉత్పత్తి చేస్తుంది. దీనితో పాటు బయటి వాతావరణంలోని దుమ్ము, చెమట , మనం వాడే వివిధ హెయిర్ స్టైలింగ్ ప్రొడక్ట్స్ జుట్టులో పేరుకుపోతాయి.

కేవలం నీటితో మాత్రమే కడిగినప్పుడు ఈ జిడ్డు , మొండి మురికి అస్సలు వదిలిపోదు. వీటిని తొలగించాలంటే షాంపూలలో ఉండే ‘సర్ఫ్యాక్టెంట్లు’ అనే శుభ్రపరిచే కారకాలు అవసరమవుతాయి. మురికిని పూర్తిగా కడగకపోతే తల చర్మంపై ఉండే రోమ రంధ్రాలు మూసుకుపోతాయి. ఫలితంగా తలలో చుండ్రు విపరీతంగా పెరగడం, తీవ్రమైన దురద రావడం , జుట్టు విపరీతంగా రాలడం వంటి సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా పలుచని జుట్టు లేదా అధిక జిడ్డు తత్వమున్న చర్మం (ఆయిలీ స్కాల్ప్) గలవారు కేవలం నీటిని మాత్రమే వాడితే వారి జుట్టు మరింత నిర్జీవంగా, ముద్దగా మారిపోతుంది.

నిపుణులు సూచిస్తున్న సరైన మార్గం ఏది?
జుట్టు ఆరోగ్యంగా ఉండటానికి షాంపూను పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదని వంట , కేశ నిపుణులు సలహా ఇస్తున్నారు. దీనికి బదులుగా మీ జుట్టు తత్వానికి సరిపోయే ఒక మధ్యస్థ మార్గాన్ని ఎంచుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే రసాయనాలు తక్కువగా ఉండే మైల్డ్ లేదా సల్ఫేట్ లేని (Sulfate-free) షాంపూలను ఉపయోగించి తలను శుభ్రం చేసుకోవాలి. మిగిలిన రోజులలో కేవలం జుట్టును తాజాగా ఉంచుకోవడం కోసం సాధారణ నీటితో కడుక్కోవచ్చు. ఈ విధమైన సమతుల విధానం వల్ల తల చర్మంలోని సహజ నూనెలు దెబ్బతినకుండా ఉండటమే కాకుండా, జుట్టు మురికి లేకుండా ఎల్లప్పుడూ శుభ్రంగా, సురక్షితంగా ఉంటుంది.

Follow Us