వీకెండ్ ట్రిప్స్, కాస్ట్‌లీ ఫోన్..! మారుతున్న ఫైనాన్షియల్ ప్రయారిటీల గురించి తెలుసా

ప్రతి తండ్రి ఆర్థిక సూత్రం చాలా సరళమైనది, ఎంతో కష్టపడి సంపాదించిన అనుభవం నుండి వచ్చింది: "ఇప్పుడు పొదుపు చేయి.. భవిష్యత్తులో ఇల్లు, పెళ్లి లేదా జీవితంలోని ఒక ముఖ్యమైన మైలురాయి కోసం ఆ డబ్బును ఉపయోగించు." కానీ, కొడుకు ఆలోచన మరోలా ఉంది: "ఆర్థిక భద్రత అంటే కేవలం బతకడం కాదు, జీవితాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించడం కూడా!"

వీకెండ్ ట్రిప్స్, కాస్ట్‌లీ ఫోన్..! మారుతున్న ఫైనాన్షియల్ ప్రయారిటీల గురించి తెలుసా
Generational Money Gap

Updated on: May 21, 2026 | 6:30 AM

ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువు పూర్తి చేసుకుని ఇప్పుడే ఉద్యోగంలో చేరిన 22 ఏళ్ల ప్రియదర్శి కుమార్ ఒకరోజు తన తండ్రి దగ్గరకు వెళ్లి రూ. 80,000 విలువైన ఐఫోన్ కొనుక్కుంటానని చెప్పాడు. ఆ మాట వినగానే అతని తండ్రి షాక్‌కు గురయ్యారు. అసలు అంత ఖరీదైన ఫోన్ ఎందుకు కొనాలో ఆయనకు అస్సలు అర్థం కాలేదు. స్నేహితులతో కలిసి చిన్న చిన్న ట్రిప్పులకు వెళ్తానని చెప్పినప్పుడల్లా ఆ ఇంట్లో ఇదే చర్చ జరుగుతుంటుంది.

ఇది కేవలం ఒక ఐఫోన్ లేదా ట్రిప్ గురించి జరుగుతున్న గొడవ కాదు. జీవితాన్ని చూసే రెండు వేర్వేరు కోణాల మధ్య జరుగుతున్న ఒక మానసిక సంఘర్షణ. పాత తరానికి, నేటి యువతరానికి (Gen-Z) మధ్య డబ్బును వాడుకునే విషయంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోందని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

మారుతున్న నిర్వచనం..

పెద్దల కాలంలో ఆర్థిక స్థిరత్వం అంటే త్వరగా సొంత ఇల్లు కొనుగోలు చేయడం, స్థిరమైన ఉద్యోగం, ఎలాంటి అప్పులు లేకుండా ఉండటం, మరియు భవిష్యత్తు కోసం చాలా ఏళ్ల పాటు నిదానంగా పొదుపు చేయడం. కానీ, నేటి తరం విజయానికి సరికొత్త నిర్వచనాలు ఇస్తోంది. వారు కేవలం ఆస్తుల సంపాదన కంటే వ్యక్తిగత స్వేచ్ఛ, కొత్త అనుభవాలు, మానసిక ఆరోగ్యం, మరియు పని-జీవిత సమతుల్యతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. దీని అర్థం వారు బాధ్యతారాహిత్యంగా ఉన్నారని కాదు, ప్రస్తుత సామాజిక, ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా వారి ఆలోచనలు మారాయి.

బ్యాంక్‌బజార్ నివేదికల ప్రకారం, నేడు 30 ఏళ్ల లోపు ఉన్న యువ పెట్టుబడిదారులు నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) లో ఏకంగా 40 శాతం మంది ఉన్నారు. ఇది 2019లో కేవలం 23 శాతంగానే ఉండేది. దీన్ని బట్టి నేటి తరం బాధ్యతల నుండి తప్పించుకోవడం లేదు సదా, మునుపటి తరం కంటే చాలా చిన్న వయసులోనే పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తున్నారని స్పష్టమవుతోంది. సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ శివమ్ కుమార్ తెలిపినట్లు.. నేటి యువత పొదుపు చేయడంతో పాటు “డబ్బును ఖర్చు పెట్టకుండా కేవలం దాచి ఉంచడం వల్ల ప్రయోజనం లేదు” అని నమ్ముతున్నారు.

సోషల్ మీడియా ప్రభావం..

యువత ఆర్థిక నిర్ణయాలను ప్రభావితం చేయడంలో సోషల్ మీడియా అల్గారిథమ్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లలో కనిపించే లగ్జరీ లైఫ్‌స్టైల్, బ్రాండెడ్ గ్యాడ్జెట్లు, మరియు విదేశీ ప్రయాణాల వీడియోలు యువత ఆలోచనలను మార్చేస్తున్నాయి. ఒకప్పుడు సమాజంలో కేవలం పక్కింటి ‘శర్మగారి అబ్బాయి’తోనే పోలికలు ఉండేవి, కానీ ఇప్పుడు డిజిటల్ ప్రపంచం వల్ల ప్రతి రంగంలోనూ మనకంటే ఎక్కువ సంపాదిస్తూ, విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న వారు నిరంతరం కళ్ల ముందు కనిపిస్తూనే ఉంటారు. దీనివల్ల చాలామంది తమ సక్సెస్‌ను చాటిచెప్పడం కోసం కాన్సెర్ట్ టికెట్లు, బ్రాండెడ్ వస్తువులపై విపరీతంగా ఖర్చు పెడుతున్నారు.

అయితే, సోషల్ మీడియా వల్ల ఆర్థిక అవగాహన కూడా పెరుగుతోంది. గతంలో కేవలం ఫైనాన్షియల్ అడ్వైజర్లకు మాత్రమే తెలిసిన ఎస్‌ఐపి (SIP), మ్యూచువల్ ఫండ్స్, క్రెడిట్ స్కోర్ వంటి పదాలు ఇప్పుడు సాధారణ యువకుడికి సైతం అర్థమవుతున్నాయి. కానీ, ఆన్ లైన్ లో కనిపించే ప్రతి సమాచారం సరైనది కాదని, ఆ రంగుల ప్రపంచం వెనుక ఉన్న అప్పుల గురించిన నిజాలు ఎవరూ చూపించరని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మానసిక సంఘర్షణ..

డబ్బు అనేది కేవలం అంకెలతో కూడినది కాదు, దాని వెనుక భద్రత, త్యాగం, ప్రేమ, మరియు బాధ్యత వంటి ఎన్నో భావోద్వేగాలు దాగి ఉంటాయి. ఆర్థిక అనిశ్చితిని చూసిన తల్లిదండ్రులు పొదుపును ఒక రక్షణ కవచంలా భావిస్తే, నేటి తరం మాత్రం మానసిక ప్రశాంతతకు ప్రాధాన్యత ఇస్తోంది. దీనివల్ల యువతలో ఒక రకమైన అంతర్మథనం మొదలవుతోంది. తల్లిదండ్రులు ఎంతో పొదుపుగా జీవిస్తుంటే, తాము స్నేహితులతో కలిసి హోటల్‌లో ఖరీదైన డిన్నర్ చేయడం వారి త్యాగాన్ని అవమానించడమేనా అనే గిల్ట్ ఫీలింగ్ చాలామందిలో ఉంటోంది.

ఈ సమస్యను అధిగమించడానికి ఆర్థిక నిపుణులు ఒక చక్కని ప్రణాళికను సూచిస్తున్నారు. యువత తమ సంపాదనలో 10 శాతం డైరెక్ట్ ఈక్విటీకి, 20 శాతం మ్యూచువల్ ఫండ్స్‌కు, మరియు మరో 20 శాతం అత్యవసర నిధిగా దాచుకోవాలి. మిగిలిన 50 శాతం నిధులను తమ లైఫ్‌స్టైల్ మరియు ప్రయాణాల కోసం వాడుకోవచ్చు. ఇలా చేయడం వల్ల భవిష్యత్తుకు భరోసా ఉండటంతో పాటు ప్రస్తుత జీవితాన్ని కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.

అలాగే, ఇళ్లలో డబ్బు గురించి మాట్లాడేటప్పుడు భాష మార్చడం ఎంతో అవసరం. “నువ్వు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటున్నావు” అని కొడుకును నిందించే కంటే, “నీ భవిష్యత్తు గురించి నాకు ఆందోళనగా ఉంది” అని ప్రేమగా చెప్పడం వల్ల ఇరు తరాల మధ్య దూరం తగ్గుతుంది. ముగింపులో చెప్పాలంటే, రెండు కోణాలూ ముఖ్యమైనవే. పొదుపు అనేది జీవితానికి స్థిరత్వాన్ని ఇస్తే.. ప్రయాణాలు, కొత్త అనుభవాలు మనిషికి ఆత్మవిశ్వాసాన్ని, ఆనందాన్ని ఇస్తాయి. తల్లిదండ్రుల క్రమశిక్షణ వెనుక ఉన్నది వారి భయం కాదు, మనపై ఉన్న ప్రేమే అని యువత గ్రహించినప్పుడు.. ఈ మనీ వార్‌కి సులభంగా ఎండ్ కార్డ్ పడుతుంది.

Follow Us