కరోనా వైరస్ వ్యాప్తి కాకుండా.. దేశంలో లాక్డౌన్ విధించడం సరైన చర్య అని ప్రపంచవ్యాప్తంగా మేధావులు అభిప్రాయపడుతున్నారని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మన దగ్గర వైద్య సదుపాయాలు తగినంత స్థాయిలో లేని నేపథ్యంలో..ప్రజలు సామాజిక దూరం పాటించడమే ఏకైక లక్ష్యమని తేల్చి చెప్పారు. వైద్యులు, పోలీసులకు సహకరించి…కరోనాను తెలంగాణ నుంచి తరమికొట్టాలని కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. లాక్డౌన్ ప్రభావం వ్యవసాయ రంగంపై, రైతులపై పడకుండా కీలక చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.
ఊహించని విధంగా తెలంగాణలో అధికంగా 40 లక్షల ఎకరాల్లో వరిపంట చేతికి వస్తోందన్న సీఎం..మొక్కజొన్న కూడా ఎప్పుడూ లేని స్థాయిలో ఈ సారి అధికంగా పండిందని పేర్కొన్నారు. ఈ పంట మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందన్న సీఎం..అమ్మకాలకు సంబంధించి రైతులకు అధికారులు టోకెన్లు జారీ చేస్తారని చెప్పారు. మొక్కజొన్న అనుకున్న స్థాయిలో ధర లేదని, నియంత్రణ పద్దతిలో రైతులు అమ్మకాలు జరపాలని కోరారు.
పల్లెల్లు కరోనా ప్రభావం లేకుండా స్వచ్ఛంగా ఉన్నాయని, మార్కెట్లు ఓపెన్ చేసి ఉంటే, అక్కడికి వేల సంఖ్యలో రైతులు వస్తారు కాబట్టి.. వారికి ఈ వైరస్ అటాక్ కాకుండా మార్కెట్లకు తాళాలు వేస్తామన్నారు. గ్రామాల్లో సర్పంచులు, ప్రజలు కరోనా ప్రభలకుండా తీసుకుంటున్న జాగ్రత్తలను సీఎం కొనియాడారు. ప్రతి గింజ కొంటామని..రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ ఖజానాలో డబ్బులు లేనప్పటికి.. వరి కొనుగోలు చేయడానికి సివిల్ సప్లయ్ కార్పొరేషన్కు రూ.25 వేల కోట్లు సమకూర్చామన్నారు.