సహపంక్తి భోజనాల ఫలితం …ఊరందరికీ కరోనా

|

Sep 04, 2020 | 12:58 PM

కరోనా కాలంలో కాసింత జాగ్రత్తగా ఉండాలని ఎంతగా చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు కొందరు.. భౌతికదూరం పాటించడంటూ బతిమాలుతున్నా లెక్క చేయడం లేదు.. ఫలితంగా కరోనాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.. ప్రభుత్వాలు కొన్ని నియమనిబంధనాలు పెట్టినా పట్టించుకోని ప్రజలను ఏమనాలి?

సహపంక్తి భోజనాల ఫలితం ...ఊరందరికీ కరోనా
Follow us on

కరోనా కాలంలో కాసింత జాగ్రత్తగా ఉండాలని ఎంతగా చెప్పినా చెవికెక్కించుకోవడం లేదు కొందరు.. భౌతికదూరం పాటించడంటూ బతిమాలుతున్నా లెక్క చేయడం లేదు.. ఫలితంగా కరోనాకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది.. ప్రభుత్వాలు కొన్ని నియమనిబంధనాలు పెట్టినా పట్టించుకోని ప్రజలను ఏమనాలి? ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని వీఆర్‌కే పురం గ్రామవాసులనాలి! ఇప్పుడా గ్రామ ప్రజలంతా కరోనా బాధితులే! ఇంటికో ఇద్దరు చొప్పున కరోనా బారినపడ్డారు.. గ్రామంలో సామూహికంగా కరోనా పరీక్షలను నిర్వహించిన వైద్య అధికారులు బిత్తరపోయారు.. ఇప్పటి వరకు 98 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ కావడంతో వైద్యాధికారులు హడలిపోయారు.

అందరికీ కరోనా వైరస్‌ సోకిందంటే అది వారి స్వయకృతాపరాధమే ! వారం రోజుల కిందట జరిగిన సహపంక్తి భోజనాలే ఇందుకు కారణం.. ఈ గ్రామానికి చెందిన ఓ యువకుడు పక్షం రోజుల కిందట కన్నుమూశాడు.. అతడి దశదిన కర్మ కార్యక్రమాన్ని మొన్న 28నాడు నిర్వహించారు. గ్రామస్తులందరితో ఆప్యాయంగా మెసిలేవాడు.. గ్రామస్తుల మంచిచెడ్డ అరుసుకునేవాడు.. అందుకే ఆ కార్యక్రమానికి ఊరంతా హాజరయ్యింది. ఆ ఊరివాళ్లే కాదు.. పక్కపక్క గ్రామాలకు చెందిన బంధుగణం కూడా పాల్గొంది. అలా పాల్గొన్నవారిలో ఒకరో ఇద్దరో కరోనా బాధితులు ఉన్నారు.. తెలిసో తెలియకో ఆ వైరస్‌ను ఊరివారందరికీ అంటించారు. మొదటి రోజు ముగ్గురికి కరోనా పాజిటివ్ వచ్చింది.. వైద్య అధికారులకు ఎందుకో అనుమానం వచ్చింది. వెంటనే గ్రామంలో మెడికల్‌ క్యాంప్‌ పెట్టారు.. సహపంక్తి భోజనాలకు హాజరైన 120 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.. ఇందులో 98మందికి కరోనా పాజిటివ్‌ నిర్దారణ అయింది.. మరికొంత మంది కరోనా పరీక్షలు చేసుకోకుండా తప్పించుకుని తిరుగుతున్నారు

ఊరందరికి కరోనా అంటుకోవడంతో పోలీసులు, రెవెన్యూ అధికారులు ఈ గ్రామాన్ని దిగ్బంధించారు.. గ్రామాన్ని ఐసోలేషన్ చేసి కరోనా పాజిటివ్ బాధితులను హోం క్వారెంటైన్ లో ఉంచారు.. ఆరోగ్యం విషమించిన వారిని ములుగు జిల్లా కేంద్రంలోని కోవిడ్ వార్డుకు తరలిస్తున్నారు. ఇందుకే కాబోలు చెప్తే వినకపోతే చెడంగ చూడాలని పెద్దలు అన్నది..