దేశరాజధాని ఢిల్లీ నిజాముద్దీన్లో జరిగిన మర్కజ్ తబ్లీఘీ జమాత్ సమావేశాల గురించి తెలిసిందే. ఈ మత ప్రార్ధనలకు దేశంలోని అనేక రాష్ట్రాలతో పాటుగా.. పలువురు విదేశీయులు కూడా హాజరయ్యారు. వీరిలో కొందరికి కరోనా పాజిటివ్ సోకడం.. ఆ తర్వాత సమావేశానికి హాజరైన వారు వారి వారి స్వగ్రామాలకు పోవడంతో.. ఈ వైరస్ అన్ని రాష్ట్రాలకు వ్యాపించినట్లైంది. విషయం తెలియడంతో అప్రమత్తమైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు.. మర్కజ్ సమావేశాలకు హాజరైన వారిని గుర్తించి.. వారికి కరోనా పరీక్షలు చేస్తూ.. క్వారంటైన్లో ఉంచారు. అయితే తాజాగా రెండు రోజుల క్రితం.. మర్కజ్ తరహాలోనే దేశంలో మరికొన్ని చోట్ల సమావేశాలు జరిగాయని తేలింది. యూపీలోని దేవ్బంద్ దర్గాకు వెళ్లి వెచ్చిన వారికి కూడా కరోనా పాజిటివ్ నమోదైనట్లు తేలింది. మర్కజ్, దేవ్బంద్ తరహాలో.. దేశంలో మరికొన్ని చోట్ల కూడా ప్రార్ధనలు జరిగినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
ఈ నేపథ్యంలో.. మార్చ్ నెలలో దేశ వ్యాప్తంగా జరిగిన అన్ని మతప్రచార కార్యక్రమాలపై పోలీసులు దృష్టిసారించారు. తెలంగాణ నుండి అధిక సంఖ్యలో యూపీ,రాజస్థాన్,గుజరాత్,మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో జరిగిన మతప్రచార కార్యక్రమాలకు హాజరైనట్లు అధికారులు గుర్తించారు. అయితే పెద్దమొత్తంలో మర్కజ్ సమావేశానికే హజరయ్యారని.. మిగతా కార్యక్రమాలన్నీ చిన్నవేనని పోలీసులు తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో మార్చ్లో జరిగిన అన్ని కార్యక్రమాల గురించి మతపెద్దల నుండి సమాచారం సేకరిస్తున్నారు. ఇక దేవ్బంద్కు వంద లోపే వెళ్లగా.. అజ్మీర్ దర్గాకు 60మంది వెళ్లినట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. అయితే ఇతర రాష్ట్రాల్లో జరిగిన మత కార్యక్రమాలకు ఎవరు వెళ్లారన్న దానిపై ఇప్పుడు ఆరాతీస్తున్నారు.