
న్యాయవ్యవస్థపై యుద్ధమా..? ఏంటీ రాతలు అంటూ కొన్ని వార్తా పత్రికలపై వైసీపీ మండిపడింది. వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యల పట్ల న్యాయ వ్యవస్థ ఆగ్రహం చెందిందంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయని ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. అంతేకాదు, ఏపీలో న్యాయవ్యవస్థను మూసేయాలన్న ఉద్దేశంతో చేసినట్టుంది అని హైకోర్టు న్యాయమూర్తులు అన్నట్టుగా ఈనాడు, ఆంధ్రజ్యోతి సహా ఓ వర్గం మీడియాలో విస్తృతంగా కథనాలు వచ్చాయని సజ్జల వెల్లడించారు. కావాలంటే తమ తీర్పులపై అప్పీలుకు వెళ్లండని కూడా న్యాయమూర్తులు వ్యాఖ్యానించినట్టుగా ఆ కథనాల్లో పేర్కొన్నారని సజ్జల అన్నారు.
‘ఈ వ్యాఖ్యలు తీర్పుల్లో ఉంటే వారు చెప్పినట్టుగానే అప్పీలుకు వెళ్లి అవి చట్టబద్ధమో కాదో తేల్చమని ఎగువకోర్టును కోరడానికి అవకాశం ఉంటుంది. అయితే, న్యాయమూర్తులు విచారణ సందర్భంలో అన్నట్టుగా చెబుతున్న ఈ మాటలు తీర్పుల్లో లేకపోవడం రాజ్యాంగ వ్యవస్థలను గౌరవించేవారిని ఆందోళనకు గురిచేస్తోంది. అని సజ్జల విమర్శించారు. ఇటీవల ఏపీ హైకోర్టులో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేక నిర్ణయాలు వెలువడిన ఈ నేపథ్యంలో ఈ అంశం ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది.