కాంగ్రెస్ పార్టీలో ‘మినీ ముసలం’, ఎన్ఎస్ యూఐ నేత రుచి గుప్తా రాజీనామా, రాహుల్ అధ్యక్షుడు కావాలని డిమాండ్

| Edited By: Pardhasaradhi Peri

Dec 19, 2020 | 8:24 PM

కాంగ్రెస్ లో అసమ్మతివాదులు, విధేయులు అంతా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోను, రాహుల్,  ప్రియాంక గాంధీ తోను సమావేశమైన రోజే పార్టీలో 'మినీ ముసలం' వంటిది తలెత్తింది. పార్టీ అనుబంధ..

కాంగ్రెస్ పార్టీలో మినీ ముసలం, ఎన్ఎస్ యూఐ నేత రుచి గుప్తా రాజీనామా, రాహుల్ అధ్యక్షుడు కావాలని డిమాండ్
Follow us on

కాంగ్రెస్ లో అసమ్మతివాదులు, విధేయులు అంతా పార్టీ అధినేత్రి సోనియా గాంధీతోను, రాహుల్,  ప్రియాంక గాంధీ తోను సమావేశమైన రోజే పార్టీలో ‘మినీ ముసలం’ వంటిది తలెత్తింది. పార్టీ అనుబంధ విద్యార్ధి విభాగమైన నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా సంయుక్త కార్యదర్శి రుచి గుప్తా రాజీనామా చేశారు. పార్టీ సంస్థాగత మార్పుల్లో జాప్యం జరుగుతున్నందుకు నిరసనగా తాను రాజీనామా చేస్తున్నట్టు ఆమె ప్రకటించారు. ఇలా ఆలస్యం కావడంవల్లే పార్టీకి తీవ్ర నష్టం వాటిల్లుతోందని ఆమె తన వాట్సాప్ మెసేజ్ లో పేర్కొన్నారు. ఈ సంస్థలో తనకీ పదవినిచ్చినందుకు రుచి గుప్తా… రాహుల్, సోనియా గాంధీలకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ని రాహుల్ మాత్రమే నడపగలరని, మరెవరూ నడపలేరని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ పార్టీకి సమర్ధుడైన అధ్యక్షుడు, సముచిత నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ఉండాలని, అలా కాని పక్షంలో ఈ సంస్థ వేర్వేరు దిశల్లో సాగుతుందని రుచి గుప్తా అన్నారు. ఇప్పటికైనా పార్టీ ప్రక్షాళన జరగాలని ఆమె కోరారు. ఈమె వాట్సాప్ మెసేజ్ ని ఓ ఇంగ్లీష్ డైలీ ‘ చాకింగ్ ఔట్ ది కాంగ్రెస్ పార్టీస్ ఎండ్యూరింగ్ రివైవల్’ అనే శీర్షికతో ప్రచురించింది.

కేవలం ఇది ఎన్ ఎస్ యూ ఐ నేత తీసుకున్న నిర్ణయమే అయినా ఈ విద్యార్ధి విభాగంలో ఇది  కాక రేపుతుందని భావిస్తున్నారు. తన రాజీనామా లేఖలో రుచి గుప్తా ప్రకటించినవి ఆమె సొంత అభిప్రాయాలే అయినప్పటికీ . సీనియర్ నేతలు దీన్ని తీవ్రంగా పరిగణించే అవకాశాలున్నాయని ఈ విద్యార్ధి విభాగంలోని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. బహుశా ఈ విభాగంలో మరికొందరు నేతలు కూడా రాజీనామా చేయవచ్చునని అంటున్నారు. కాంగ్రెస్ అధిష్టానం రుచి గుప్తా తీసుకున్న నిర్ణయంపై ఎలా స్పందిస్తుందో చూడాలి.