
ఉస్మానియా యూనివర్సిటీ ఫైనల్ పరీక్షలకు తేదీ ఖరైంది. కరోనా ప్రభావంతో నిలిచిపోయిన ఓయూ పీజీ చివరి సెమిస్టర్ పరీక్షలు ఈనెల 19 నుంచి మొదలుకానున్నాయి. ఇందుకోసం ఉస్మానియా యూనివర్సిటీ చరిత్రలోనే తొలిసారిగా సెమిస్టర్ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షా కేంద్రాలను వర్సిటీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో వర్సిటీ హాస్టళ్లలోకి విద్యార్థుల అనుమతిపై అంక్షలు విధిస్తున్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హాస్టళ్లలో చేరితే ప్రమాదం అని భావించిన అధికారులు.. ఇతరల విద్యార్థులు రావద్దని సూచిస్తున్నారు.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన విద్యార్థలుు ఓయూలో చదువుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో వీరంతా హైదరాబాద్కు వచ్చి పరీక్షలు రాయడం సాధ్యం కాదు. ఈ నేపథ్యంలో వారు ఎంపిక చేసుకున్న ప్రాంతాల్లోనే పరీక్షలు నిర్వహించేలా వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందు కోసం రాష్ట్రవ్యాప్తంగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. విద్యార్థులు తమకు అనుకూలమైన పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకునేందుకు ఓయూ వెబ్సైట్లో వివరాలను అందుబాటులో ఉంచారు. ఈ నెల 12వ తేదీ వరకు వెబ్సైట్ ద్వారా విద్యార్థులు పరీక్ష కేంద్రాన్ని ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా వార ఎంపిక చేసుకున్న సెంటర్లలో పీజీ ఫైనల్ సెమిస్టర్ పరీక్షలు రాసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నారు.