కోవిద్ 19 కరాళ నృత్యం చేస్తోంది. ఈ వైరస్ ఇప్పుడు భారత్ లోనూ విజృంభిస్తోంది. కరోనా మహమ్మారి ప్రపంచ వ్యాప్తంగా 200 దేశాలకు పైగా పాకింది. ఇప్పటికే లక్ష మందిని పొట్టనబెట్టుకుంది. అగ్రరాజ్యాలను సైతం ఈ వైరస్ భయపెడుతోంది. అత్యధిక కరోనా బాధితులతో పాటు అధిక మరణాలతో అగ్రరాజ్యం విలవిలలాడుతోంది. అటు గల్ఫ్ దేశాల్లోనూ విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఈ దేశాలు ‘కొవిడ్-19’ వ్యాప్తిని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపట్టాయి. ఇక గల్ఫ్లో ప్రవాస భారతీయులు కూడా అధిక సంఖ్యలోనే ఉన్నారనేది విదితమే.
కాగా.. జీసీసీ(గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్) దేశాధినేతలతో ప్రధాని మోదీ భారతీయుల యోగ క్షేమాలు, భద్రత విషయమై ఫోన్ ద్వారా వాకబు చేసిన విషయం తెలిసిందే. అలాగే భారత్ నుంచి గల్ఫ్ దేశాలకు కరోనాపై పోరుకు వైద్య పరంగా ఎలాంటి సహయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటికే ఈ మహమ్మారిపై పోరాడుతున్న దేశాలకు హైడ్రాక్సీ క్లోరోక్విన్ సరఫరా చేస్తూ అండగా నిలుస్తున్న భారత్ తాజాగా కువైట్కు 15 మంది సభ్యులతో కూడిన వైద్య బృందాన్ని పంపింది. ఈ వైద్య బృందం 15 రోజుల పాటు కువైట్లోనే ఉండనుంది. అక్కడ ‘కొవిడ్-19’ టెస్టులు నిర్వహించడంతో పాటు ఈ మహమ్మారి బారిన పడి వారికి చికిత్స అందించనుంది.