దేశ రాజధాని ఢిల్లీలో ఓ పోలీసు సర్వీస్ రివాల్వర్తో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వసంత విహార్ ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న స్పెషల్ బ్రాంచ్ పోలీస్ జీవితంపై విరక్తితో బలవన్మరణానికి పాల్పడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
హర్యానాలోని జాజర్కు చెందిన సందీప్ కుమార్ వసంత విహార్ పోలీస్ స్టేషన్ పరిధిలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, శుక్రవారం రాత్రి పోలీస్ స్టేషన్లోనే ఆయన తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ఆత్మహత్యకు చేసుకున్నాడు. దీంతో తోటి సిబ్బంది ఆస్పత్రికి తరలించే లోపే సందీప్ తుదిశ్వాస విడిచారు. సందీప్ ఆత్మహత్యకు ముందు తీసుకున్న సెల్ఫీ వీడియోను స్థానిక పోలీసలు స్వాధీనం చేసుకున్నారు. ఆ వీడియోలో సందీప్.. మంచి భర్తగా, మంచి కుటుంబసభ్యుడిగా కాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. అటు సందీప్ మృతిపై స్పందించేందుకు కుటుంబ సభ్యులు నిరాకరించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి కరోనా పరిక్షలు నిర్వహించిన అనంతరం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని పోలీసు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.