Andhrapradesh : వైద్య ఖర్చు వెయ్యిదాటితే ఆరోగ్య శ్రీ …నేటి నుంచి మరో ఆరు జిల్లాల్లో..
విద్య, వైద్యం విషయంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసకుంటోంది ఏపీలోని జగన్ సర్కార్. తాజాగా రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు సామాన్యులకు మరింత చేరువ చేసింది.
విద్య, వైద్యం విషయంలో పలు విప్లవాత్మక నిర్ణయాలు తీసకుంటోంది ఏపీలోని జగన్ సర్కార్. తాజాగా రాష్ట్రంలోని మరో ఆరు జిల్లాల్లో ఆరోగ్యశ్రీ సేవలు సామాన్యులకు మరింత చేరువ చేసింది. వైద్య ఖర్చులు వెయ్యిరూపాయలు దాటితే ఆరోగ్య శ్రీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఆరోగ్య శ్రీ కి వర్తించే వైద్య సేవలను సైతం 2 వేల 146కు పెంచారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఈ ఏడాది జనవరిలోనే ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రారంభించారు ముఖ్యమంత్రి. ప్రజలకు ఈ ప్రాజెక్ట్ ఎంతోగానో ఉపయోగపడుతుందని రిపోర్ట్ అందడంతో..పరిధి పెంచాలని ఇటీవల నిర్ణయించారు. ఈ క్రమంలో నేటి నుంచి ప్రకాశం, గుంటూరు, కడప, కర్నూలు, విశాఖ, విజయనగరం జిల్లాల్లో సేవలను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం జగన్ ఆయా జిల్లాల్లోని ఆస్పత్రుల్లో వైద్య సేవలను ప్రారంభించనున్నారు.
ఆరోగ్యశ్రీ కార్డు ఉన్న కుటుంబానికి ఏడాదికి 2 లక్షల నుంచి 5 లక్షల వరకు వైద్య ఖర్చులకు ప్రభుత్వం డబ్బు మంజూరు చేస్తుంది. క్యాన్సర్ రోగులకు ఎంత ఖర్చైనా గవర్నమెంటే భరిస్తుంది. సీఎం సొంత జిల్లా కడపలో 30 ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో..ఈ వైద్య సేవలు అందుబాటులోకి రానున్నాయి. వీటిలో మూడు గవర్నమెంట్ హాస్పిటల్స్ కాగా… మిగిలినవన్నీ ప్రైవేటు ఆసుపత్రులే. ఆరోగ్యశ్రీ కింద వైద్యం చేయించుకోవాలనుకున్నవారు తప్పనిసరిగా ఆసుపత్రికి ఆరోగ్యశ్రీ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. ఆరోగ్యశ్రీ కింద ఆసుపత్రుల్లో ఆపరేషన్స్ చేయించుకుని డిశ్చార్జి అయిన తర్వాత….వ్యాధులను బట్టి రోగికి నెలకు 5 వేల రూపాయల వరకు ఆరోగ్య ఆసరా కింద అందించనుంది ప్రభుత్వం. దాదాపు 836 రకాల వ్యాధులకు సంబంధించిన వారికి ఆరోగ్య ఆసరా కింద సాయం అందిస్తున్నారు.