ఇకపై నాలుగేళ్ల డిగ్రీ చేసినవారికి నేరుగా పీహెచ్డీలోకి ప్రవేశం కల్పించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వెల్లడించారు. అన్ని కాలేజీలు మూడేళ్లలో పూర్తి ప్రమాణాలు సాధించి నేషనల్ బోర్డు అఫ్ అక్రిడిటేషన్(ఎన్బీఏ), నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్(ఎన్ఏసీ) గుర్తింపు పొందాలని ఆయన అన్నారు. తాజాగా నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020పై సీఎం జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు. కాలేజీల్లో ప్రమాణాలపై ఎస్ఓపీలు ఖరారు చేయాలని తెలిపారు. (National Education Policy 2020)
అన్ని కళాశాలల్లో రెగ్యులర్గా తనిఖీలు చేయాలని.. ఇందుకోసం 30 మందితో 10 బృందాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ముఖ్యంగా టీచర్ ట్రెయినింగ్ కాలేజీలపై దృష్టి సారించాలన్నారు. కాలేజీల్లో ప్రమాణాలు లేకపోతే నోటీసులు ఇవ్వాలని.. అప్పటికీ మార్పు రాకపోతే ఆ కళాశాలలను మూసివేయాలని సీఎం జగన్ స్పష్టం చేశారు. ఉన్నత విద్యలో రొబొటిక్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డేటా అనలటిక్స్ వంటి కొత్త కోర్సులు రూపొందించాలన్నారు. ఇక నుంచి ఏడాది లేక రెండేళ్లు పీజీ.. మూడు లేక నాలుగేళ్లు డిగ్రీ ప్రోగ్రాములు ఉండాలని తెలిపారు. అలాగే రాష్ట్రంలో అటానమస్ కాలేజీల సంఖ్య పెంచాలని సూచించారు. అటు బీఈడీ కాలేజీలు ఖచ్చితంగా ప్రమాణాలు పాటించాలని.. దానికి తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు.
Also Read:
మందుబాబులకు కిక్కిచ్చే వార్త.. ఆన్లైన్లో మద్యం అమ్మకాలు.!
ఏపీలో కొత్త ఎక్సైజ్ పాలసీ.. ఆ ప్రదేశాల్లో లిక్కర్ షాపులకు నో పర్మిషన్..