ఏపీలో తగ్గిన కరోనా కేసులు

|

Oct 05, 2020 | 7:01 PM

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గత కొద్దిరోజులుగా గణనీయంగా పెరిగిన కేసులు క్రమంగా తగ్గితూవస్తున్నాయి.

ఏపీలో తగ్గిన కరోనా కేసులు
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ కేసులు భారీగా తగ్గిపోయాయి. గత కొద్దిరోజులుగా గణనీయంగా పెరిగిన కేసులు క్రమంగా తగ్గితూవస్తున్నాయి. కరోనా మరణాలు కూడా భారీగా తగ్గిపోయాయి. సోమవారం రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో గడిచిన 24 గంటల్లో 56,145 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 4,256 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కరోనా వైరస్ కేసులు 7,23,512కు చేరుకున్నాయి.

అలాగే, రాష్ట్రంలో కరోనా వైరస్ మరణాలు కూడా స్వల్పంగా పడిపోయాయి. ఆదివారం కరోనా బారినపడి 40 మంది మరణించగా, సోమవారం ఆ సంఖ్య 38కి తగ్గాయి. దీంతో రాష్ట్రవ్యాప్తంగా కరోనా మహమ్మారి వల్ల మృతి చెందిన వారి సంఖ్య 6,019కు చేరుకుంది. కరోనా మహమ్మారి బారిన పడి గడిచిన 24 గంటల్లో కృష్ణా జిల్లాలో ఏడుగురు, చిత్తూరులో ఐదుగురు, కడపలో ఐదుగురు, అనంతపురంలో నలుగురు, విశాఖపట్నంలో నలుగురు, తూర్పు గోదావరిలో ముగ్గురు, గుంటూరులో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, ప్రకాశంలో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఒకరు, విజయనగరంలో ఒకరు మృత్యువాత పడ్డారు.

అలాగే గత కొన్ని రోజులుగా డిశ్చార్జిలు కూడా ఏపీలో స్వల్పంగా పెరిగాయి. సోమవారం 7,558 మంది కరోనా మహమ్మారిని పూర్తిగా జయించి డిశ్చార్జి అయ్యారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా నమోదైన మొత్తం 7,23,512 పాజిటివ్ కేసులకు గాను, 6,66,433 మంది డిశ్చార్జి కాగా, ప్రస్తుతం 51,060 మంది వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తూర్పు గోదావరి జిల్లాలో కరోనా కేసులు యథావిధిగా పెరిగిపోతున్నాయి. ఈ ఒక్క జిల్లాలో 1,01,638 మందికి కరోనా సోకింది.