
ఆంధ్రప్రదేశ్ లోని సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో నాడు–నేడుపై సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన సమావేశానికి డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మంత్రి విశ్వరూప్, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం వైయస్ జగన్ మాట్లాడుతూ.. హాస్టళ్లలో నాడు–నేడు అమలు చేసి వాటి పరిస్థితిని మార్చాలని అధికారులను ఆదేశించారు. హాస్టళ్లలో చక్కటి వాతావరణం, నాణ్యమైన ఆహారం ఉండాలన్నారు. జగనన్న గోరుముద్ద మాదిరిగా మెనూ ఉండాలని అధికారులకు సూచించారు. హాస్టల్ విద్యార్థులకూ జగనన్న విద్యా కానుక ఇస్తామని సీఎం చెప్పారు. పిల్లలకు ఏం ఇస్తే బాగుంటుంది..? ఏ విధంగా పౌష్టికాహారం ఇవ్వాలనేదానిపై ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్ ఆదేశించారు. హాస్టళ్లలో పూర్తి వసతులను నాడు–నేడు కార్యాక్రమంలో భాగంగా కల్పిస్తామని సీఎం పేర్కొన్నారు. హాస్టళ్లల్లో ఉండే విద్యార్థలకు కూడా బెల్టులు, దుప్పట్లు, అల్మారాలు, మంచాలు, ఇతర కనీస వసతులు ఉండాలన్నారు.
ఇక రాష్ట్రంలో సాంఘిక సంక్షేమ, గిరిజన సంక్షేమ, బీసీ సంక్షేమ, మైనారిటీ సంక్షేమ శాఖలకు సంబంధించి బాలురు, బాలికల కోసం మొత్తం 4,772 హాస్టళ్లు ఉండగా, వాటిలో 4,84,862 మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారని సమావేశంలో అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువచ్చారు. మొత్తం హాస్టళ్లలో దాదాపు 4 వేలు సొంత భవనాల్లో ఉన్నట్లు వివరించారు. నాడు–నేడు రెండో దశ కార్యక్రమంలో ఆ హాస్టళ్లలో మార్పులు చేయనున్నట్లు పేర్కొన్నారు.