జగన్దంతా రాజకీయమే… లాక్డౌన్ వద్దన్నారు.. కన్నా విసుర్లు
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కేవలం రాజకీయాలపైనే ఫోకస్ వుందని, ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు.
ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి కేవలం రాజకీయాలపైనే ఫోకస్ వుందని, ప్రజారోగ్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ విరుచుకుపడ్డారు. దేశమంతా లాక్ డౌన్ కోరుకుంటే ఏపీ ముఖ్యమంత్రి జగన్ మాత్రం లాక్ డౌన్ వద్దంటూ ప్రజారోగ్యాన్ని ఫణంగా పెట్టారని కన్నా ఆరోపించారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులు అర్పించిన తర్వాత లక్ష్మీనారాయణ ప్రసంగించారు.
ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే మన దేశంలో లాక్ డౌన్ తర్వాత పరిస్థితి అత్యంత మెరుగ్గా వుందని కన్నా అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ముందు చూపుతో లాక్ డౌన్ సమర్దవంతంగా అమలవుతుందన్నారాయన. లాక్ డౌన్ పొడిగించాలని ఏపి ముఖ్యమంత్రి జగన్ తప్ప అందరూ కోరారని, ఏపి ముఖ్యమంత్రికి రాజకీయం తప్ప ప్రజల ప్రాణాల విలువ తెలియదని కన్నా విమర్శించారు.
విపత్తును పక్కన పెట్టి స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి పెట్టి కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని కన్నా ఆరోపించారు. ఆరోగ్య సేతు యాప్ను ప్రతి ఒక్కరు డౌన్ లోడ్ చేసుకోవడంతో పాటు ఆకలితో పేదలు అలమటించకుంచకుండా చేతనైన సహాయం చేయాలని సూచించారు కన్నా. లాక్ డౌన్ పరిస్థితిలో పని చేస్తున్నవారిని విధుల నుండి తొలగించ వద్దని కన్నా ఏపీ ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. ప్రాణాలు ఉంటే దేశ ఆర్దిక వ్యవస్థ ఎప్పుడైనా చక్కబెట్టు కోవచ్చనే ఆలోచనను ప్రతి ఒక్కరు కలిగి ఉండాలని కన్నా వ్యాఖ్యానించారు.