
రైలు ప్రయాణం.. దూర ప్రాంతాల వారికి అత్యంత సౌకర్యవంతం, అలాగే చవకైనది కూడా.! అందుకే దేశ నలుమూలలా రైలు సర్వీసులు ఉండేలా ఏర్పాటు చేసింది రైల్వే శాఖ. దీనికి అనుగుణంగా ప్రతీ చోటా రైల్వే స్టేషన్లు కూడా రద్దీగా ఉండటం సర్వసాధారణం. ఈ క్రమంలోనే రైల్వే శాఖ ప్రయాణీకులకు అత్యంత సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించేందుకు పలు కీలక నిబంధనలను అమలులోకి తీసుకొచ్చింది. వాటిని అతిక్రమిస్తే జరిమానాతో పాటు శిక్ష కూడా తప్పదని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
సాధారణంగా మనం దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు రైలు ప్రయాణాన్ని ఎంచుకుంటాం. ఆ సమయంలో మన దగ్గర ప్రయాణించే ట్రైన్ టికెట్ ఉంటే చాలు.. ప్లాట్ఫార్మ్ టికెట్ అవసరం లేదని భావిస్తుంటాం. కానీ ఇది కొంతవరకూ మాత్రమే నిజం.. అయితే దీనిపై స్పష్టమైన నిబంధనలు కొన్ని ఉన్నాయి. పగటిపూట బయల్దేరే రైళ్లలో ప్రయాణించేవారు.. ప్రయాణ సమయానికంటే రెండు గంటల ముందు స్టేషన్కు వచ్చేందుకే అనుమతి ఉంది. రెండు గంటల కంటే ముందు రావడానికి అస్సలు అనుమతి లేదు. అలాగే రాత్రిపూట ట్రైన్లో ప్రయాణించేవారు ఆరు గంటలకు మించి ముందుగా స్టేషన్కు రాకూడదు. అయితే ఈ నిబంధనలు మాత్రం లేటైన ట్రైన్లకు వర్తించవు. ఇకపై ప్రయాణ సమయానికంటే ముందు స్టేషన్కు వచ్చి.. గంటలు గంటలు గడిపే ఛాన్స్ లేదు. రైలు వచ్చే పరిమితి సమయం కంటే.. ఎక్కువ సేపు స్టేషన్లో ఉండాలనుకుంటే.. తప్పనిసరిగా ఫ్లాట్ఫార్మ్ టికెట్ తీసుకోవాల్సిందేనని రైల్వే శాఖ క్లారిటీ ఇచ్చింది. లేదంటే జరిమానా తప్పదని హెచ్చరించింది.