75 సంవత్సరాలలో ఇదే తొలిసారి..!
అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని పరిస్థితులన్నింటిని మార్చేసింది. ముందుగా వేసుకున్న ప్రణాళికలకు బ్రేక్ వేసింది.
అనుకోకుండా వచ్చిన కరోనా మహమ్మారి ప్రపంచంలోని పరిస్థితులన్నింటిని మార్చేసింది. ముందుగా వేసుకున్న ప్రణాళికలకు బ్రేక్ వేసింది. ప్రపంచవ్యాప్తంగా చాలా రంగాలు స్తంభించాయి. ఇక కరోనా నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్లో జరగాల్సిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ వార్షిక సమావేశాలకు దేశాధినేతలు హాజరుకావడం లేదు. ఈ విషయాన్ని అధ్యక్షుడు టిజానీ ముహమ్మద్ బండే తెలిపారు. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించిన ఆయన.. 75 ఏళ్లలో ఐరాస చరిత్రలో దేశాధినేతలు లేకుండా సభ నిర్వహించడం ఇదే తొలిసారని వెల్లడించారు.
సభ నిర్వహిస్తే దేశాధినేతలతో పాటు వారి వెంట భారీ యంత్రాంగం రావాల్సి ఉంటుందని.. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది మంచిది కాదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అయితే సాధారణ సభల్లో ఆయా దేశాధినేతలు ఎలా ప్రసంగించాలనే విషయంపై రెండు వారాల్లో వెల్లడిస్తామని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉంటే గత నెలలో ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ మాట్లాడుతూ.. సంస్థ 75వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించే యోచనను విరమించుకోనున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో దేశాధినేతలు ముందే రికార్డు చేసిన సందేశాలను ఐరాసలోని తమ దౌత్యవేత్తల ద్వారా వినిపించాలని ఆయన కోరారు.
Read This Story Also: మీరా చోప్రా ఫిర్యాదు.. ట్విట్టర్ సంస్థకి పోలీసుల లెటర్..!